న్యాయవాదులకు కేరళ హైకోర్టు సూచన
కొచ్చి: తీర్పులపై వ్యాఖ్యానాలు చేయడం మానుకోవాలని కేరళ హైకోర్టు న్యాయవాదులకు సూచించింది. తీర్పులను చదవకుండానే సామాజిక మాధ్యమాలు లేదా పత్రికలకు వాటిని వివరించడం, వ్యాఖ్యానించడం కొంతమంది న్యాయవాదులకు పరిపాటిగా మారిందని, తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని విమర్శించాలని కోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 19న విడుదలైన మలయాళ మిస్టరీ హర్రర్ చిత్రం ‘చురులి’లో అశ్లీల, అసభ్యకర డైలాగులు ఉన్నాయని ఆరోపిస్తూ, సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫాం నుంచి దానిని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ మేరకు అభిప్రాయపడ్డారు. పిటిషన్ పెండిరగ్లో ఉన్న సమయంలో కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును ఆయన ప్రస్తావిస్తూ… జనవరి 7 నాటి ఉత్తర్వు దాదాపు అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సరిగ్గానే ప్రచురించబడినప్పటికీ, సోషల్ మీడియా దానిని భిన్నమైన రీతిలో వ్యాఖ్యానించిందని అన్నారు. పిటిషన్పై నిర్ణయం తీసుకునే ముందు, ప్రజల మర్యాద, నైతికతకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించారా లేదా ఏదైనా క్రిమినల్ నేరం బయటపడిరదా అనే దానిపై రాష్ట్ర పోలీసుల అభిప్రాయాన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని కోర్టు పేర్కొంది. కానీ సోషల్ మీడియా కోర్టు ‘చురులి’ చిత్రంలో అసభ్యకర భాష ఉందా లేదో కనుగొనాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు అర్థం చేసుకుంది. దీంతో కోర్టు ఆదేశించిన ఉత్తర్వును పూర్తిగా చదవకుండానే వ్యాఖ్యానించినట్లు స్పష్టమైందని న్యాయమూర్తి అన్నారు. సోషల్ మీడియా వేదికలను సమాజంలోని ఒక వర్గం ఈ విధంగా దుర్వినియోగం చేస్తుందని కోర్టు పేర్కొంది.