న్యూదిల్లీ : దేశంలో సుదీర్ఘ కాలంగా వినిపిస్తున్న నదుల అనుసంధానికి సంబంధించి తొలి అడుగు పడుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో నదుల అనుసంధానికి సంబంధించి పలు ప్రాజెక్టులను పేర్కొన్నారు. వీటిలో కెన్-బెత్వా ప్రాజెక్టు కీలకమైనది. ఈ ప్రాజెక్టునకు రూ.44,605 కోట్ల వ్యయం కానుంది. ఈ ఏడాది రూ.1400 కోట్లు కేటాయించారు. ఈ రెండు నదులు మధ్యప్రదేశ్లో పుట్టి ఉత్తర్ప్రదేశ్లోని యమునలో కలుస్తాయి. కెన్లో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో బెత్వాలో కలిపితే రెండు రాష్ట్రాల్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే దమన్గంగ-పింజల్, పార్-తాపి-నర్మద, గోదావరి-కృష్ణ, కృష్ణ-పెన్నా, పెన్నా-కావేరీలకు సంబంధించి డీపీఆర్లను సిద్ధం చేయనున్నారు. గోదావరి-కృష్ణ నదులకు సంబంధించి పరివాహక రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అలాగే పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో, కావేరి పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంది. అయితే, పరివాహక రాష్ట్రాలతో ఏకాభిప్రాయం కుదిరిన అనంతరమే ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. ఇక ముంబై దాహార్తిని తీర్చేందుకు.. మహారాష్ట్రలోని దమన్గంగ-పింజల్ లింక్ ప్రాజెక్టు ద్వారా దమన్గంగలోని మిగులు నీటిని పింజల్ డ్యామ్ ద్వారా ముంబైకి తరలిస్తారు. పార్-తాపి-నర్మద ప్రాజెక్టును గుజరాత్, మహారాష్ట్రలు నిర్మించనున్నాయి. పశ్చిమ కనుమల్లోని మిగులు నీటిని గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతానికి, మహారాష్ట్రలోని ఉత్తర ప్రాంతానికి తరలించనున్నారు.
నీటి లభ్యత తేల్చాలి
గోదావరిలో నీటి లభ్యత వెల్లడిరచి అనుసంధానం ప్రారంభించాలని తెలంగాణ ఇదివరకే కేంద్రాన్ని కోరింది. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా తమ ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా నదుల అనుసంధానాన్ని చేపట్టాలని ఇదివరకే కేంద్రానికి సూచించింది.