‘ఇంటి నుంచి పని’ అమలుకు ప్రభుత్వ ఆదేశం
న్యూదిల్లీ: కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మినహాయింపు పొందిన కేటగిరీలు మినహా అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని దిల్లీ ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది.నగరంలో ఇప్పటి వరకు 50 శాతం సిబ్బందితో పనిచేస్తున్న ప్రైవేట్ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని రెస్టారెంట్లు, బార్లను మూసివేయాలని తెలిపింది. అయితే హోమ్ డెలివరీకి ఆర్డర్లను తీసుకోవడానికి రెస్టారెంట్లు అనుమతించబడ్డాయి. తాజా ఆంక్షలు తక్షణం అమలులోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దిల్లీలోని కోవిడ్-19 పరిస్థితిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సోమవారం జరిగిన డీడీఎంఏ సమావేశంలో సమీక్షించారు. గత కొన్ని రోజులుగా కోవిడ్-19 కేసుల సంఖ్య (ఓమిక్రాన్ వేరియంట్ కేసులతో సహా) వేగంగా పెరుగుతున్నాయని, పాజిటివిటీ రేటు 23 శాతం దాటిందున దిల్లీలో అదనపు ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని భావించినట్లు డీడీఎంఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యాంకులు సహా అవసరమైన సేవలను అందించే కంపెనీలు, బీమా, మెడిక్లెయిమ్, ఫార్మా కంపెనీలతో సహా ప్రైవేట్ కార్యాలయాలను ఆంక్షలనుంచి మినహాయించారు. అలాగే న్యాయవాదుల కార్యాలయాలు, కొరియర్ సేవలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సెక్యూరిటీ సర్వీసెస్, మీడియా, పెట్రోల్ పంపులు, చమురు , గ్యాస్ రిటైల్, స్టోరేజీ అవుట్లెట్లు 100 శాతం సిబ్బందితో పనిచేస్లాయి.