కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై భవానీపుర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ను ప్రకటించిన క్రమంలో ఒక్కసారిగా ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పార్టీ నేతలతో విస్తృత చర్చల తర్వాత బీజేపీ ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలిపింది. బెంగాల్లో పేరుగాంచిన నేతలున్నప్పటికీ.. దీదీకి పోటీగా ప్రియాంక తిబ్రీవాల్నే ఎందుకు ఎంపిక చేశారనేది చాలా మందిలో మెదిలిన ప్రశ్న. ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేయటం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింస కేసులపై టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడిన క్రమంలో అధిష్ఠానం దృష్టిలో ప్రియాంక పడ్డారని, అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. దీదీకి పోటీగా బరిలో దిగేందుకు చాలా మంది విముఖత తెలిపిన క్రమంలో పార్టీకి ఉన్న కొన్ని అవకాశాల్లోంచి తిబ్రీవాల్ను ఎంపిక చేసినట్లు మరో వర్గం విశ్వసిస్తోంది.సెప్టెంబర్ 30న జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక దీదీని ఎదుర్కోబోతున్నారు. ఈ క్రమంలో తిబ్రీవాల్ గురించి కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం.. ప్రియాంక తిబ్రీవాల్ 1981, జులై 7న కోల్కతాలో జన్మించారు. తన పాఠశాల విద్యను వెల్లాండ్ గౌల్డ్స్మిత్ స్కూల్లో పూర్తి చేయగా, దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 2007, కోల్కతా విశ్వవిద్యాలయం పరిధిలోని హజ్రా లా కళాశాల నుంచి న్యాయ విద్య పట్టా అందుకున్నారు. అలాగే థాయిలాండ్లోని అసంప్సన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితమై, బీజేపీ నేత బాబుల్ సుప్రియో సూచనలతో 2014లో బీజేపీలో పార్టీలో చేరారు. సుప్రియోకు న్యాయ సలహాదారుగా ఆమె వ్యవహరిస్తున్నారు. 2015లో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డు నంబర్ 58లో(ఎంటల్లీ) బీజేపీ టికెట్పై పోటీ చేశారు. అయితే.. టీఎంసీ అభ్యర్థి స్వపన్ సమ్మద్దర్పై ఓటమి చవిచూశారు. 2020, ఆగస్టులో బెంగాల్ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఆరేళ్ల కాలంలో పార్టీ హైకమాండ్ తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రియాంక, టీఎంసీ అభ్యర్థి స్వర్ణ కమల్ సాహాపై 58,257 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అధర్మంపైనే పోరు : ప్రియాంక
మమతా బెనర్జీపై పోటీలో నిలుస్తున్న క్రమంలో ప్రియాంక తిబ్రీవాల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఈ క్రమంలో తాను ఏ ఒక్కరికి వ్యతిరేకంగా పోటీ చేయట్లేదని, అధర్మంపైనే పోటీ చేస్తున్నాని వెల్లడిరచారు. ‘నా పోటీ ఏ ఒక్కరిపై కాదు, అధర్మంపైనే. బెంగాల్ ప్రజలను కాపాడేందుకే నేను పోటీ చేస్తున్నా. అవును, రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఇప్పటికీ ఒక్క మాట మాట్లాడని వ్యక్తి(సీఎం)పైనే నా పోటీ’ అని పేర్కొన్నారు.