బీకేయూ నాయకుడు రాకేష్ తికైత్
ఆగ్రా : ఉత్తర ప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని రైతులను కోరతానని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేష్ తికైత్ సోమవారం తెలిపారు. నూతన ‘నల్ల’ వ్యవసాయ చట్టాలపై బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వ్యతిరేకిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతు లేదా మా అభ్యర్థులను నిలబెట్టడం జరగదు’ అని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తికైత్ ఆగ్రాలో పోలీసు కస్టడీలో మరణించిన అరుణ్ నర్వార్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యునికి ప్రభుత్వం ఉద్యోగంతోపాటు రూ.40 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నర్వార్ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లింపు విషయంలో వివక్ష చూపుతోంది. లఖింపూర్ ఖేరి, కాన్పూర్ ఘటనల్లో రూ.40 నుంచి 45 లక్షల పరిహారం చెల్లించింది. ఆగ్రాలో రూ.10 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చింది. అరుణ్ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం వివక్ష ప్రదర్శించకూడదు’ అని చెప్పారు. అతని మరణంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని, నర్వార్ కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా తికైత్ డిమాండ్ చేశారు.