బుందేల్ఖండ్లో అన్నదాతల ఆత్మహత్యలు
పట్టించుకోని యోగి ప్రభుత్వం
లక్నో : ఉత్తరప్రదేశ్లో పంటరుణాల కోసం అన్నదాతలు ముప్పతిప్పలుపడుతున్నారు. పంట నష్టాలు, అప్పుల బాధలు, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలు వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నాయి. కరువు ప్రాంతంగా పేరున్న బుందేల్ఖండ్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అప్పుల బాధ తట్టుకోలేక బండా జిల్లాలో ఇటీవల చున్ను సింగ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంకు నుంచి, స్థానిక వడ్డీవ్యాపారుల నుంచి ఆయన కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు, వడ్డీ వ్యాపారులు ఆయనపై ఒత్తిడి చేశారనీ, ఈ కారణంగానే ఆయన ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి కుటుంబీకులు తెలిపారు. కూతురు పెండ్లి కోసమని మటౌంద్ బ్రాంచ్ సెంట్రల్ బ్యాంకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) నుంచి తన సోదరుడు రూ. 1.80 లక్షలు అప్పుగా తీసుకున్నాడని చున్ను సింగ్ సోదరుడు మన్ సింగ్ తెలిపాడు. అలాగే, వడ్డీ వ్యాపారుల నుంచి చున్ను రూ. 2.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడని వివరించాడు. వడ్డీ వ్యాపారుల విషయంలో చున్ను తీవ్రంగా భయపడ్డాడని మన్ సింగ్ చెప్పాడు. అకాల వర్షాల కారణంగా చున్ను సింగ్ తన వ్యవసాయ భూమిలో వేసిన పంటలో అధిక భాగం నష్టపోవాల్సి వచ్చింది. మిగతా పంటకు తెగులు సోకింది. దీంతో పంట చేతికి వచ్చిన తర్వాత అప్పులు తీరుద్దామనుకున్న చున్ను సింగ్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో బాకీలు చెల్లించకపోతే పరువు పోతుందన్న భయంతో చున్ను బలవన్మరణాకి పాల్పడ్డాడని మన్ సింగ్ చెప్పాడు.