లఖింపూర్ ఖేరీ (ఉత్తరప్రదేశ్) : టికోనా అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న అశిష్ మిశ్రా తనకు స్నేహితుడని బుధవారం సిట్ ముందు హాజరైన అంకిత్దాస్ ఒప్పుకున్నారు. అక్టోబరు 3వ తేదీన జరిగిన అల్లర్లలో నలుగురు రైతులతో సహా ఎనిమిదిమంది మృతిచెందిన కేసులో దర్యాప్తు అధికారులు దాస్ను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో లఖింపూర్లోని రిజర్డ్వ్ పోలీస్ లైన్స్లో ఉన్న క్రైంబ్రాంచి కార్యాలయానికి తన లాయర్లతో దాస్ చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం దాస్, మరోవ్యక్తి లతీఫ్ కోర్టులో జడ్జిముందు లొంగిపోయేందుకు అర్జీ పెట్టుకున్నారు. అంకిత్ దాస్, మరణించిన మాజీ మంత్రి అఖిలేష్దాస్కు స్వయానా మేనల్లుడు. ఏ కారుతో అయితే నలుగురు రైతులను ఢీకొట్టించారో అది తనదేనని దాస్ ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మరోవ్యక్తి శేఖర్ భారతిని మంగళవారం అరెస్టు చేయగా, మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, లవ్కుష్, అశిష్ పాండేలను అంతకుముందే అరెస్టు చేశారు.