పెంపుడు కుక్క ఓ చిన్న పిల్లవాడిని కరిచినా..పట్టించుకోకుండా వెళ్లిపోయిన యజమానికి మున్సిపల్ కార్పొరేషన్ రూ. 5 వేల జరిమానా విధించింది. ఈనెల ఐదో తేదీ సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చిన ఓ బాలుడు ఘజియాబాద్లోని రాజ్నగర్ ఎక్స్టెన్షన్ చార్మ్స్ కౌంటీ సొసైటీలో ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికే ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్లోకి వచ్చింది. కాసేపటికే ఆ కుక్క పిల్ల… బాలుడిపైకి దూకి అతడిని కరిచింది. ఆ చిన్నారి నొప్పితో అరుస్తున్నప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం చలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు నంద్గ్రామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. సదరు మహిళకు రూ. 5 వేల జరిమానా విధించారు.