రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై వారం రోజులు కావస్తున్నా అటు అధికార పక్షంగానీ, ఇటు విపక్షం నుంచి గానీ ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. విపక్షాల నుంచి పవార్, ఫరూక్, గోపాలకృష్ణ గాంధీల పేర్లు ప్రతిపాదించినా వారు మాత్రం పోటీకి విముఖత వ్యక్తం చేశారు. మరోవైపు, అధికార పక్షం మాత్రం విపక్షాలు ప్రకటించే అభ్యర్థిని బట్టే తమ నేతను ఎంపిక చేయాలని భావిస్తోన్నట్టు భోగట్టా. ఒక కూటమి నిర్ణయం కోసం మరో కూటమి ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని విపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాలు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రపతిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాన్ని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ సున్నితంగా తిరస్కరించారు. దీంతో కొత్త అభ్యర్థి కోసం విపక్షాలు అన్వేషిస్తుండగా.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. మంగళవారం విపక్షాలతో శరద్ పవార్ నిర్వహిస్తున్న సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉంది. యశ్వంత్ సిన్హా గత ఏడాది పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలకు ముందే బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో సిన్హాకు ఇప్పటికే కొన్ని పార్టీలు మద్దతు పలికాయనీ, ఆయన అభ్యర్థిత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నారని టీఎంసీ సీనియర్ నేత ఒకరు వెల్లడిరచారు. మాజీ ప్రధాని వాజ్పేయీకి అత్యంత సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. నాటి వాజ్పేయీ పాలన.. నేటి మోదీ పాలన ఎలా మారిందో తేడాను చెప్పే క్రమంలో సిన్హా పేరును తెరపైకి వ్యూహాత్మకంగా తెచ్చినట్లు తెలుస్తోంది.