కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఆయనేనా? అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీలో ఆయన ఉన్నారు. టీఎంసీకి రాజీనామా చేసినట్టు సిన్హా ప్రకటించారు. కాసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… ‘టీఎంసీలో మమతాబెనర్జీ గారు నాకు ఇచ్చిన గౌరవానికి నేను కృతజ్ఞుడను. విస్తృతమైన జాతీయ ప్రయోజనాల కోసం, విపక్షాల ఐక్యత కోసం తాను పార్టీ నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. నా నిర్ణయాన్ని మమత ఆమోదిస్తారని భావిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. టీఎంసీకి రాజీనామా చేసినట్టు యశ్వంత్ ప్రకటించడంతో… రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపు అభ్యర్థిగా పోటీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్డీయే అభ్యర్థి విషయంలో కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.