కోవిడ్ కొత్త మార్గదర్శకాలు
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత .. క్లినికల్ డ్రగ్స్తో చికిత్స విధానం గురించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్న పిల్లలు, 18 ఏళ్లలోపు వారికోసం కోవిడ్-19 కు చికిత్స విధానంలో సవరించిన సమగ్ర మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. ఐదేళ్లు లోపు వయసు ఉన్న పిల్లలకు మాస్క్లు సిఫార్సు చేయడం లేదని కూడా పేర్కొంది. అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6ఏళ్ల నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సురక్షితంగా, సరైన పద్ధతిలో మాస్క్లను ఉపయోగించవచ్చని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన వారు పెద్దల మాదిరిగానే మాస్క్లు ధరించాలని తెలిపింది.
ఇక ఇటీవల ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య నిపుణుల బృందం మార్గదర్శకాలను సమీక్షించింది. ఈ వేరియంట్ల వల్ల వచ్చే వ్యాధి తీవ్రతను ఇతర దేశాలలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ మహమ్మారి సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే గుణం ఉన్నందున తగిన పర్యవేక్షణ అవసరమని తెలిపింది. లక్షణం లేనివారిలో లేదా తేలికపాటి లక్షణాలు గల కేసులలో చికిత్స కోసం ‘యాంటీమైక్రోబయాల్స్ లేదా ప్రొఫిలాక్సిస్’ సిఫారసు చేయడం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రమైన లక్షణాలు ఉన్న సందర్భాల్లో.. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉన్నదనే అనుమానం ఉంటే తప్ప యాంటీమైక్రోబయాల్స్ ఇవ్వకూడదని పేర్కొంది. చికిత్స కోసం ఉపయోగించే స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన వ్యవధిలో ఉపయోగించాలని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ మార్గదర్శకాలను మరింత సమీక్షించి, కొత్త లక్షణాలు, చికిత్స లభ్యత ఆధారంగా మరిన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.