రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు కమలం పార్టీ నేతలు సీరియల్ కిల్లర్లలా వ్యవహరిస్తున్నారని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధ్వజమెత్తారు. దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు.సీబీఐ తన నివాసంలో 14 గంటల పాటు సోదాలు చేసినప్పుడు అధికారులు తన దుస్తులు, పిల్లల దుస్తులు కూడా వెతికారని సిసోడియా తెలిపారు. తనిఖీల్లో వాళ్లకు ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐర్ మొత్తం ఫేక్ అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సభాముఖంగా తెలిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలను ఖూనీ చేసేందుకు బీజేపీ నేతలు చాలా శ్రమిస్తున్నారని, ఆ శ్రద్ధ ఏదో స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణంపై పెట్టాల్సిందని సిసోడియా హితవుపలికారు. ఇతరులు మంచి పనులు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ అభద్రతాభావానికి లోనవుతున్నారని సిసోడియా విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని తాను చూడలేదన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయి ఉంటే మోదీలా చేసేవారు కాదని సిసోడియా అన్నారు. ఢల్లీి ప్రభుత్వం విత్డ్రా చేసుకున్న ఎక్సైజ్ పాలసీని సిసోడియా సమర్థించారు. దాని వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడలేదని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందని సిసోడియా పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా దాంట్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తోందని మండిపడ్డారు.