న్యూదిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రోజువారీ పనులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం, రైతులను మరింత నిస్సహాయులను చేయడం గురించే మోదీ ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామని యువతకు కల్లబొల్లి కబుర్లు చెబుతారని విమర్శించారు. ‘రోజ్ సుబప్ా కీ బాత్’ హ్యాష్ట్యాగ్ వినియోగించి అనేక సమస్యల గురించి మోదీపై ట్వీట్ రూపంలో విమర్శలు సంధించారు. కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతున్న ఇంధన, గ్యాస్ ధరలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై రాహుల్ వినూత్నంగా ట్వీట్ చేస్తూ మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన రోజూ ఈ పనులు చేయకుండా ఉండలేరని ట్వీట్ చేస్తూ జాబితాను ఓ జతపరిచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఎంత పెంచాలి, ఖర్చులపై ప్రజలు చర్చించుకోకుండా ఎలా ఆపాలి, యువతకు ఉపాధి కల్పనపై కథలు ఎలా అల్లాలి, ఏ ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేయాలి, రైతులను మరింత నిస్సహాయులుగా ఎలా చేయాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.