లోక్సభ ఎన్నికల మూడవ దశలో భాగంగా అసోంలోని నాలుగు స్థానాలకు మంగళవారం (7వ తేదీన) ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి 47 మంది పోటీ చేస్తున్నారు. అయితే వీరిలో 15 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఎన్డీయే తరపున బరిలో నిలిచిన నలుగురు కూడా సంపన్నులే కాగా బారాపేట, గువహతి లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే వారిలో ఐదుగురు కోటీశ్వరులు ఉన్నారు. ధుబ్రీ, కోక్రారaర్ స్థానాల నుంచి ఇద్దరు చొప్పున సంపన్నులు పోటీ చేస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 32శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. రాష్ట్రంలోని 14 లోక్సభ నియోజకవర్గాల నుంచి 143 మంది పోటీలో ఉండగా వీరిలో 49 మంది కోటీశ్వరులు ఉన్నారు. మరోవైపు కేవలం రూ.25,521 విలువ చేసే చరాస్థి ఉన్నట్లు ఓ స్వతంత్ర అభ్యర్థి త్రిప్తినీ రభా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కోక్రారaర్ (ఎస్టీ) బరిలో నిలిచారు. అందరి కంటే సంపన్న అభ్యర్థిగా ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ (ధుబ్రీ అభ్యర్థి) నిలిచారు.
ఇక కాంగ్రెస్, ఏజీపీ నుంచి చెరో ఇద్దరు… బీజేపీ, ఏఐయూడీఎఫ్, బోడో పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ (యూపీపీఎల్), తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఏకం సనాతన్ భారత్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సంపన్న అభ్యర్థులు ఈసారి పోటీ చేస్తున్నారు. నలుగురు స్వతంత్రులు కూడా కోటీశ్వరులేనని అఫిడవిట్ చెబుతోంది. సంపన్న అభ్యర్థుల్లో ఉన్న ఇద్దరు మహిళలు… బీజేపీ అభ్యర్థి బిజులీ కలిత మేధి, కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్తాకుర్ గోస్వామి గువహతి నుంచి తమ అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నారు.