మార్చి 2026 వరకు నాలుగేళ్ల వరకు అవకాశం
రాష్ట్రాల బడ్జెట్ రహిత అప్పులపై కేంద్రం నిర్ణయం
న్యూదిల్లీ : రాష్ట్రాల బడ్జెట్ రహిత రుణాలను సర్దుబాటు చేయడానికి కేంద్రం నిబంధనలను సడలించింది. గత ఆర్థిక సంవత్సరంలోని అటువంటి బాధ్యతలను వచ్చే నాలుగేళ్ల వారి రుణ పరిమితితో మార్చి 2026 వరకు సర్దుబాటు చేయవచ్చని పేర్కొంది. ఈ చర్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలకు నిధులు సమకూర్చడానికి వనరులను ఖాళీ చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి, బడ్జెట్లో లేని రుణాలను రాష్ట్రాల స్వంత రుణంతో సమానం చేయాలని, 2020-21, అలాగే 2021-22లో ప్రభుత్వాలు సేకరించిన అటువంటి నిధులను ఈ సంవత్సరం రుణ పరిమితి నుంచి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని మార్చిలో కేంద్రం రాష్ట్రాలకు తెలియజేసింది. బడ్జెట్ రహిత రుణాలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రత్యేక ప్రయోజన వాహకాలు మొదలైన వాటి ద్వారా తీసుకున్న రుణాలను సూచిస్తాయి. ఇక్కడ రుణాలు తీసుకునే సంస్థ ద్వారా వచ్చే నగదు ప్రవాహాలు లేదా ఆదాయాలకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వ స్వంత బడ్జెట్ నుంచి అసలు, వడ్డీని తిరిగి చెల్లిస్తారు. అటువంటి రుణాలు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు లేదా చట్టబద్ధమైన సంస్థల ద్వారా రాష్ట్ర బడ్జెట్ వెలుపల రుణాలను మార్గం చేయడం ద్వారా ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు నిర్ణయించబడిన నికర రుణ పరిమితిని దాటవేస్తాయి. తిరిగి చెల్లించే బాధ్యత రాష్ట్రాలదే అయినందున ఇది వారి రాబడి, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి రుణాల పరిమాణంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరిమితి కారణంగా అనేక రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున, ఆర్థిక మంత్రిత్వ శాఖ నిబంధనలను సడలించింది. అయితే 2020-21 వరకు రాష్ట్రాలు చేసిన బడ్జెట్ రహిత రుణాలను సర్దుబాటు చేయకపోవచ్చు. 2021-22లో చేసిన వాటిని మార్చి 2026 వరకు 4 సంవత్సరాల వరకు సర్దుబాటు చేయవచ్చు. ‘కొన్ని రాష్ట్రాల బడ్జెట్లో లేని రుణాల పరిమాణం, రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, 2020-21 సంవత్సరం వరకు రాష్ట్రాలు చేసిన బడ్జెట్ రహిత రుణాలను సర్దుబాటు చేయరాదని నిర్ణయించింది. కాగా ‘2021-22లో రాష్ట్రాలు బడ్జెట్కు వెలుపల తీసుకున్న రుణాల కారణంగా తదుపరి సర్దుబాటును నాలుగు సంవత్సరాల వరకు (2022-23 నుంచి 2025-26 వరకు) చేయాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని వ్యయ విభాగం తెలిపింది. నిబంధనల ప్రకారం, నిర్ధిష్ట ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పరిమితికి మించి తాజా రుణాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గత రెండు సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలకు నిధులు సమకూర్చడానికి, కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించడానికి బడ్జెట్లో లేని రుణాలను ఆశ్రయించాయి. భారతదేశ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రధాన ఆర్థికవేత్త డి.కె.పంత్ మాట్లాడుతూ 2021`2022 బడ్జెట్ రహిత రుణాలను సర్దుబాటు చేయడం వల్ల కొన్ని రాష్ట్రాలకు తీవ్రమైన వనరుల కొరత ఏర్పడుతుందని అన్నారు. ‘రాష్ట్ర బడ్జెట్ ద్వారా రుణ సేవలు జరుగుతున్న రాష్ట్రం సంతులనం లేని రుణాల సర్దుబాటును వాయిదా వేయాలన్నది మంచి నిర్ణయం’ అని తెలిపారు. ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ బడ్జెట్ రహిత రుణాలకు సంబంధించి సవరణలు కొన్ని రాష్ట్రాలకు గణనీయమైన ఉపశమనాన్ని అందించగలవని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు రుణాలను తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. క్రిసిల్ రేటింగ్స్ అధ్యయనం ప్రకారం, సంతులం లేని రుణాలు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి 2021-22లో రాష్ట్రాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతానికి లేదా దాదాపు రూ.7.9 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇది 2019-20 నుంచి సుమారు 100 బేసిస్ పాయింట్ల పెరుగుదలను సూచిస్తుంది. దేశంలోని మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)కి చెందిన 75 శాతం వాటా కలిగిన 11 రాష్ట్రాలపై క్రిసిల్ అధ్యయనం వెల్లడిరచింది. బడ్జెట్ రహిత రుణాలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, మహమ్మారి ప్రేరేపిత మందగమనం, పెరుగుతున్న ఆదాయ వ్యయాల కారణంగా నిర్బంధిత ఆదాయ వృద్ధి రాష్ట్రాల ఆర్థిక లోటు జీఎస్డీపీలో 4 శాతానికి పెరగడానికి దారితీసింది. ఇది గత దశాబ్ద కాలంలో చూసిన చారిత్రక స్థాయి 2-3 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది రాష్ట్రాలు తమ స్వంత సంస్థలకు నేరుగా నిధులు సమకూర్చే స్థోమతను తగ్గించింది. ఇక రెండవ కారణమేమిటంటే, రాష్ట్రాలు ఎక్కువ రుణాలు తీసుకోవాలనుకున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులకు మించి స్పష్టమైన ఆమోదం లేకుండా చేయలేరు. కానీ రాష్ట్రాలు తమ సంస్థలు జారీ చేసే రుణాలు, అడ్వాన్సులు, బాండ్లకు హామీ ఇవ్వడానికి ముందస్తు కేంద్ర అనుమతి అవసరం లేదు. అలాగే, హామీలపై పరిమితి స్వయంగా నిర్ణయించడం జరుగుతుంది. ఇవన్నీ బడ్జెట్ రహిత రుణాలపై ఎక్కువ ఆధారపడటానికి దారితీశాయని క్రిసిల్ మే నెలలో ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రం రాష్ట్రాల నికర రుణ పరిమితిని రూ.8,57,849 కోట్లు లేదా జీఎస్డీపీలో 3.5 శాతంగా నిర్ణయించింది. విద్యుత్ రంగంలో సంస్కరణలతో ముడిపడి ఉన్న జీఎస్డీపీలో 0.50 శాతం అదనపు రుణాలు తీసుకోవడానికి కూడా రాష్ట్రాలు అర్హత కలిగి ఉన్నాయి.