Friday, May 17, 2024
Friday, May 17, 2024

తొలి లోక్‌సభ ఎన్నికల్లో పేర్లు చెప్పని మహిళా ఓటర్లు

దేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంది. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలే ఈ పరిస్థితికి కారణం. ఓటర్ల జాబితాలు తయారు చేసేటప్పుడు స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను కట్టుదిట్టంగా పాటిస్తున్న మహిళలు తమ అసలు పేర్లు చెప్పకుండా ఫలానా వ్యక్తి భార్యననో, కుమార్తెననో చెప్పసాగారు. పితృస్వామ్య సమాజం నీడ నుంచి స్త్రీలను విముక్తం చేయడానికి ప్రాధాన్యమివ్వడం వల్లనే మహిళా ఓటర్లు తమ పేర్లు చెప్పాలని ఎన్నికల కమిషన్‌ పట్టుబట్టింది. 1950లో భారత్‌ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడానికి ఒక రోజు ముందు ఏర్పడిన ఎన్నికల సంఘం ఇంతవరకు 17 లోక్‌సభ ఎన్నికలు నిర్వహించింది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేటప్పుడు భౌగోళిక, జనవర్గ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. అప్పట్లో అత్యధిక జనాభా నిరక్షరాస్యులు కావడం పెద్ద సమస్య. నాడు పేరు చెప్పడానికే సంకోచించిన మహిళా ఓటర్లు నేడు పురుషులను మించి పోలింగ్‌లో పాల్గొంటున్నారు.
బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్య భారత్‌, రాజస్థాన్‌, వింధ్య ప్రదేశ్‌లోనే సొంత పేర్లు చెప్పని మహిళల కేసులు ఎక్కువగా ఎదురయ్యాయి. అప్పట్లో దేశంలోని మహిళా ఓటర్ల సంఖ్య 8 కోట్లు. వారిలో 28 లక్షల మంది తమ పేర్లు చెప్పకుండా భర్తలు, తండ్రుల పేర్లు చెప్పడంతో వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు. దానికి ముందు సొంత పేర్లు చెప్పడానికి మహిళా ఓటర్లకు నెల రోజుల వ్యవధి ఇచ్చారు. బీహార్‌లో చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా, రాజస్థాన్‌ మహిళలు మాత్రం పేర్లు చెప్పడానికి ముందుకురాలేదు. దీంతో అలాంటి మహిళల పేర్లను గడువు ముగిసిన తరవాత తొలగించారు.
1951-52 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌ మినహా యావత్‌ దేశంలో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 45 శాతం మంది మహిళా ఓటర్లే. తొలి లోక్‌ సభ ఎన్నికల్లో మహిళల కోసం 27,527 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో 47.1 కోట్లమంది మహిళా ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే కాస్త ఎక్కువ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img