ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణ కల్పిస్తారు. మొత్తం 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు. అయితే, ఈ భద్రతకు అయ్యే ఖర్చుని అదానీయే భరించనున్నారు. దీనికి నెలకి రూ.15-20 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని కొందరు ప్రముఖులకు ముప్పు ఉందని కేంద్ర భద్రతా ఏజెన్సీలు రూపొందించిన నివేదిక ఆధారంగా అదానీకి భద్రత కల్పించినట్లు వారు తెలిపారు. ఈ బాధ్యతను చేపట్టాలని సీఆర్పీఎఫ్కు చెందిన వీఐపీ సెక్యూరిటీ విభాగానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా, మరో వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 2013లో కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ కమాండోల జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అందించింది. ఆ తర్వాత ఆయన భార్య నీతా అంబానీకి సైతం జడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది.