డబ్బులిస్తామన్నా తీసుకోలేదు : పాటిల్
బెంగళూరు : కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులపై బీజేపీ బండారం బట్టబయలైంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే రెండేళ్ల తర్వాత కొన్ని నిజాలను బయటపెట్టారు. కాంగ్రెస్ను వీడేందుకు బీజేపీ తనకు భారీ మొత్తంలో నగదు ఇస్తామని ఆశచూపిందని కర్ణాటకలోని ఖగ్వాడ్ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను పైసా కూడా తీసుకోలేదని, డబ్బుకు బదులుగా మంత్రి పదవి ఇవ్వాలని కోరానని చెప్పారు. ప్రస్తుత కేబినెట్లో ప్రభుత్వం తనకు మంత్రి పదవి ఇవ్వలేదని, తరువాతి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని హామీ ఇచ్చారని తెలిపారు. రెండేళ్ల క్రితం ఆపరేషన్ కమలం పేరుతో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిన విషయం విదితమే. ఈ వార్తలు నిజమేనని ఎమ్మెల్యే బాలాసాహెబ్ పాటిల్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. నాడు కర్ణాటక కాంగ్రెస్లో బాలాసాహెబ్ సీనియర్ నేతగా ఉన్నారు. 2019లో హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ గూటికి చేరిన 16 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో బాలాసాహెబ్ ఒకరు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కేబినెట్లో బాలాసాహెబ్కు మంత్రి పదవి దక్కింది. అయితే యడియూరప్ప రాజీనామాతో బసవరాజు బొమ్మై సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్లో బాలాసాహెబ్కు చోటు దక్కలేదు. దీంతో బీజేపీ అధిష్ఠానంపై అసంతృప్తితో రగిలిపోతున్న పాటిల్ తన అక్కసును, ఆవేదనను వెళ్లగక్కారు. పాటిల్ వ్యాఖ్యలు దుమారం లేపడంతో గొంతు సవరించుకొని తాను అలా చెప్పలేదని బొంకారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మండిపడ్డారు. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ‘ఆపరేషన్ కమలం’లో భాగంగా పాటిల్కు డబ్బు ఆశజూపి బీజేపీలోకి తీసుకున్నారని, ఇప్పుడైనా ఆయన నిజం చెప్పినందుకు సంతోషమని వ్యాఖ్యానించారు. దీనిపై ఏసీబీ దర్యాప్తు జరపాలని శివకుమార్ ట్వీట్ చేశారు.