పంజాబ్లో తాత్కాలిక టీచర్లకు కేజ్రీవాల్ భరోసా
చండీగఢ్ : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి వస్తే ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. పంజాబ్లో అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో కేజ్రీవాల్ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధ్యాయులు శనివారం మొహాలిలో చేపట్టిన ఆందోళనకు కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. స్వయంగా ఆయన ఉపాధ్యాయుల నిరసనలో పాల్గొన్నారు. చండీగఢ్ విమానాశ్రయంలో దిగిన కేజ్రీవాల్…వెంటనే తాత్కాలిక ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు భవనం వద్దకు వెళ్లారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని తాత్కాలిక టీచర్లు 165 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కేజ్రీవాల్ వెంట ఆప్ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ మాన్ పంజాబ్ ఇన్చార్జి జర్నైయిల్సింగ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హర్పాల్సింగ్ చీమా ఉన్నారు. పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆప్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయులను కేజ్రీవాల్ వేడుకున్నారు. దిల్లీలో తమ ప్రభుత్వం విద్యావ్యవస్థను మెరుగురిచిందని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించిందని ఆయన తెలిపారు. గడచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్, అకాలీ ప్రభుత్వాలు ఉపాధ్యాయుల డిమాండ్లను పట్టించుకోలేదని విమర్శించారు. ‘ఈరోజు నేనిక్కడికి వచ్చాను. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా. దిల్లీ తరహాలోనే మీకూ న్యాయం చేస్తా. దీనిపై మీకు పూర్తి భరోసా ఇస్తున్నా’నని కేజ్రీవాల్ చెప్పారు. ఇక్కడ నెలకు కేవలం ఆరువేల రూపాయలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారని తెలిపారు. దిల్లీలో కనీస వేతనం రూ.15వేలుగా ఉందని గుర్తుచేశారు. ‘మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.