రాళ్లు రువ్వుకున్న ఇరుపార్టీల కార్యకర్తలు
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా కొనసాగుతున్న తరుణంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గోసాయీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కబీర్పుర్లో ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.పోలీసు స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరిగింది. గోసాయీగంజ్ నియోజకవర్గాన్ని బీజేపీ, ఎస్పీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఎస్పీ నుంచి అభయ్ సింగ్, బీజేపీ నుంచి ఆర్తీ తివారీ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ప్రచారం చేస్తుండగా.. కార్లు ఎదురుపడ్డాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలుఒకరిపై ఒకరు దాడికి దిగారు. అక్కడ కాసేపటికే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఎస్పీ నేతలు పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. దాడులకు దిగిన బీజేపీ శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పోలీస్స్ఠేషన్ పైనా రాళ్లు రువ్వారు. దీంతో బలగాలను దించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, నాలుగు వాహనాలు ధ్వంసమైనట్లు గుర్తించామని ఎస్ఎస్పీ శైలేశ్ పాండే తెలిపారు.తమపై దాడి జరిగిందని రెండు పార్టీల కార్యకర్తలూ ఆరోపణలు చేశారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని తెలిపారు.