అనన్య వర్మ
అఫ్గానిస్థాన్ను స్వాధీనం చేసుకోవడానికి తాలిబన్లకు ప్రతిఘటన ఎదురు కాలేదు. పంజ్ షేర్ వశం కావడానికే కాస్త సమయంపట్టింది. దానికి ప్రధాన కారకుడు అమృల్లా సలేప్ా. తాలిబన్లకు ఎదురొడ్డి నిలిచాడు. చిట్టచివరికి పంజ్షేర్ సెప్టెంబర్ మూడున తాలిబన్ల వశమైంది. అమ్రుల్లా సలేప్ా భారత్ అనుకూలుడు. అంతకు అయిదురోజులముందు అమ్రుల్లా ఆఖరిసారి చేసిన ట్వీట్లో ప్రతిఘటన ఒక్కటే మార్గమని అన్నాడు. ఆ తరవాత ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన తజిక్ జాతీయుడు. బుర్హానుద్దీన్ రబ్బానీ అఫ్గానిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమ్రుల్లా సలేప్ా రక్షణ శాఖలో పని చేశారు. గూఢచార్యం ఆయనకు ఇష్టమైన వ్యవహారం.
హమీద్ కర్జాయ్ అఫ్గానిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అమ్రుల్లా గూఢచార విభాగం అధిపతిగా ఉన్నాడు. అప్పుడు కర్జాయ్ పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ తో సమావేశమైనప్పుడు కర్జాయ్ తనతో పాటు అమ్రుల్లా ను కూడా వెంట తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో అల్ కాయదా, తాలిబన్ నాయకులు ఎక్కడెక్కడ తల దాచు కుంటున్నారో ఆ సమావేశంలో ముషర్రఫ్ కు ఓ జాబితా అందించారు. బిన్ లాదెన్ ఎక్కడున్నారో అప్పుడు తనకు తెలియదంటారు సలేప్ా. అబోతాబాద్ కు దగ్గర్లోని మన్సెహ్రాలో ఎవరెవరు తల దాచుకుంటున్నారో విని ముషర్రఫ్ ఉగ్రుడయ్యాడు. ఇటీవల తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్న దశలో సలేప్ా కాబూల్ వదిలి పంజ్ షేర్ చేరారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మాత్రం పలాయనం చిత్తగించారు. మొదటి ఉపాధ్యక్షుడిని గనక తానే తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించిన సాహసి సలేప్ా. తాలిబన్లకు ఆయన పక్కలో బల్లెమయ్యాడు. ఆయన పంజ్షేర్లో వాలీబాల్ ఆడుతున్నఫొటోలుకూడా ఇటీవల బయట కొచ్చాయి. కానీ పంజ్షేర్ తాలిబన్లవశం అయిన తరవాత ఆయన ఆచూకీ తెలియలేదు. తజకిస్తాన్ వెళ్లిపోయాడనీ కాదు పంజ్ షేర్ లోనే ఉన్నాడని రెండువాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరాదికూటమి నాయకుడు అహమద్షా మసూద్ రబ్బానీ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉండేవారు. సలేప్ాకు ఇప్పుడు 48ఏళ్లే. ఆయన వెనక్కుతగ్గడం వ్యూహాత్మకమే అంటున్నారు.
సలేప్ా ఏడేళ్లవయసులోనే అనాథగామిగిలాడు. రాజకీయ హింసా కాండను చాలా సన్నిహితంగా చూశాడు. ఆయన అన్నయ్య రొహర్లా సలేప్ాను వైమానిక దళ అధికారి. ఆయనను గత నెల 20న హతమార్చారు. సలేప్ా ఆచూకీ చెప్పాలని ఆయన అక్క మరియంను చిత్రహింసలు పెట్టారు. ఆయన తాలిబన్లకు, పాకిస్తాన్ కూ వ్యతిరేకే. సలేప్ా నిజమైన దేశభక్తుడని అఫ్గాన్ లో భారత రాయబారిగా పని చేసిన వివేక్ కట్జూ అంటారు. సలేప్ా ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలడు. రష్యాలో కొన్నాళ్లున్నాడు. ఐక్య రాజ్య సమితి అధ్యర్యంలో తాలిబన్లతో జరిగిన చర్చల్లో కూడా ఆయన భాగస్వామి. 1996లో తాలిబన్లు అధికారం స్వాధీనం చేసుకున్నప్పుడు పంజ్ షేర్ మాత్రం మసూద్ నాయకత్వంలోని ఉత్తరకూటమి అధీనంలో ఉండేది. మసూద్ అప్పుడు సలేప్ా సి.ఐ.ఎ.లో శిక్షణ కోసం అమెరికా పంపించాడు. అప్పుడే ఆయనకు గూఢచర్యం మీద ఆసక్తి పెరిగింది. ఆ తరవాత మసూద్ ఆయనను తజకిస్థాన్ లోని దుషాంబే పంపారు. అక్కడి నుంచే ఉత్తరాది కూటమి కోసం సి.ఐ.ఏ. ద్వారా ఆయుధాలు సమకూర్చే వాడు. భారత్ కూడా అప్పుడు ఉత్తరాది కూటమికి మద్దతిచ్చేది. భద్రతా వ్యవహారాల్లో ఆయనకు అపారమైన జ్ఞానం ఉందని ఆయనతో సంబంధాలున్న భారత దౌత్య సిబ్బంది అంటారు. సలేప్ా పాకిస్తాన్ వ్యతిరేకత రాజీ లేనిది. 2010 నుంచి 2013 దాకా అఫ్గాన్ రాయబారిగాఉన్న గౌతం ముఖో పాధ్యాయ అంటారు. తాలిబన్లు, ఐ.ఎస్.ఐ. ఆయనను కడతేర్చడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. భారత రాయబార కార్యాలయం మీద హక్కానీ నెట్వర్క్ దాడి చేస్తుందని సలేప్ా ముందే ఊహించారు. భారత్ ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి కాణాచి అని సలెప్ా అభిప్రాయం. పాకిస్తాన్ మదిలో ఏముందో కనిపెట్టగలిగిన దిట్ట కనకే పాకిస్తాన్కు సలేప్ా అంటే ఒళ్లు మంట. అయితే సలేప్ా ఇప్పుడు ఒంటరి పోరాటమే చేస్తున్నారు. తాలిబన్లపై ప్రజలు తిరగబడతారని బయటి నుండి సాయం అందుతుందన్నా ఆయన అంచనాలు తప్పాయి. కంఠంలోప్రాణం ఉన్నంత వరకు తాలిబన్లతో పోరాడుతూనే ఉంటానన్న సాహసి సలేప్ా.