తిట్టుకోవడం అయిపోయిందా యిక కొట్టుకోండి కసి తీరకపోతే నరుక్కోండి. అప్పుడుగాని ఆయా పార్టీలు యువతకు ఆదర్శంగా మారగలరు. ఏంటి బావ నరుక్కోండి తిట్టుకోండి అంటున్నావు ఎవరినుద్దేశించి? నువు పేపరు ఆసాంతం చదువుతావు, ఎరగనట్లు నన్ను అడుగుతావ్. అది సరే లేవయ్యా ఇప్పుడు కొత్తగా ఎవరు కొట్టుకున్నారు. అదేంటయ్యా పెద్ద పార్టీలు రెండు తమ నాయకులను, కార్యకర్తలను ఎదుటివారు కొట్టి చంపుతున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలతో పేపరు కెక్కుతున్నారుగద నిజమే. అంతటితో ఆగక జగన్ కేంద్ర బృందంతో దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీ, అమిత్ షా తోపాటు రాష్ట్రపతికి కూడ విన్నవించుకున్నాడు గద. ఇటీవల పుంగనూరులో జరిగిన అల్లర్ల విషయంలో ఆయన కేంద్రాన్ని కోరాడు. కార్లు తగలుబడినై రాళ్లు రప్పలు చాలక కర్రలు కత్తులతో ఒకరిపై ఒకరు చంపుకునే ఉద్రిక్తత చోటు చేసుకుంది గద. అసలు నా కర్థంకాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీలు సమస్యలను గాలికొదిలి యిలా నరుక్కోవడం ఎందుకో అర్థంకాదు. ఎదురు పార్టీ వారిని చంపినంత మాత్రాన సమస్యలు పరిష్కారంకావు గద. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో నాకర్థం కావడంలేదు. నిజమే సమస్యలు పరిష్కారంకోసం అభ్యర్థనలు, వినతిపత్రాలు, ధర్నాలు, నిరసనలు, దీక్షలు, ఆమరణ దీక్షలు చేయడం గతంలో చూశాం. అవన్నీ వదిలేసి ఇలా సాటిమనిషిని చంపడం సరికొత్త రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం. అవును నాకర్థం కాక అడుగుతాను. నాయకుల్ని చంపితే పార్టీ మనుగడ లేకుండా పోదుగద. ఒక నాయకుని చంపితే వందమంది నాయకులు తయారవుతారని గతంలో ఆంగ్లేయుల పాలనలో కమ్యూనిస్టులను చంపినప్పుడు ఆ నాయకులు అనేవారు. ఎందుకంటే నాయకుల్ని చంపినా సమస్యలు పరిష్కారం కోసం కొత్త నాయకులు పుట్టుకొస్తారని గత చరిత్ర నిరూపించింది. ఇవన్నీ తెలిసికూడా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. గతంలో అనేక విప్లవాలలో వేలమంది చనిపోయినా ఉద్యమాలు ఆగలేదు. నిజమే సమస్య పరిష్కారం అయ్యేవరకు ఒకరి తరువాత ఒకరు పోరాట జెండా పట్టుకొని ఉద్యమిస్తూనే ఉంటారు. నిజమే బావ ఆంగ్లేయుల పాలనలో కమ్యూనిస్టు నాయకులను కాల్చివేసినా ఇప్పటికి ఆ పార్టీలు బతికేఉన్నాయి.ఇప్పటికీ ప్రజాసమస్యల పరిష్కారంకోసం ఉద్యమాలు నడుపుతూనే ఉన్నారు.
అవును బావ చరిత్ర మన కళ్లముందు కనబడుతున్నా అనాలోచితంగా ఇలా ఒకర్ని ఒకరు చంపుకోవడాన్ని అనాగరిక చర్యగా భావించాల్సి ఉంది. రాజకీయ పార్టీ నాయకులు వారి కార్యకర్తలను రాజకీయ పార్టీలు, సమస్యల పరిష్కారం కోసం ఎలా ఉద్యమించాలో నేర్పకుండా గుండాయిజం, రౌడీయిజం నేర్పితే రానున్న రోజుల్ని మనం ఎలా ఊహించుకోవాలో తలచుకుంటే భయంగా ఉందయ్యా. ప్రత్యర్థులపై తప్పుడు కేసులుపెట్టి జైలుపాలు చేయడం ఇంకా భయపడకపోతే చంపడం ద్వారా సమస్యలు పరిష్కారం కావుగద. రాజకీయ పాఠాలకు బదులు ఎలా చంపాలో నేర్పితే భవిష్యత్తును ఊహించుకుంటే భయంగా ఉందయ్యా. ఒక పక్క కేంద్రలో అధికారంలో ఉండటంకోసం బద్దశతృవులను కూడా చంకన చేర్చుకుంటున్నారు. ప్రజలు వద్దని నిరాకరించి ఎన్నుకోనప్పుడు అధికారంకోసం వెంపర్లాడటం చూస్తే అధికారమే పరమార్థంగా రాజకీయాలు తయారవుతున్నాయి. పదేళ్లు పాలించిన తరువాత ప్రజలకు నచ్చక ఎన్నుకోకపోతే బీజేపీ ఇంకా అధికారం నిలుపుకోవడంకోసం పడేపాట్లుచూస్తే ఏవగింపు కలుగుతోంది.
అది సరే అసలు ప్రజల్లో చైతన్యం తేవాల్సిన నాయకులు వాళ్లను ఆలోచించకుండా గుడ్డిగా అనుసరించే విధంగా తయారు చేస్తున్నారు. ఓటర్లుఎవరూ అడగకపోయినా డబ్బులిచ్చి ఓటు వేయమని చివరకు ఓట్లు అమ్ముకునే స్థితికి తెచ్చింది నాయకులే. ఆలోచించకుండా చెప్పిందిచేసే అనుచరులలో ప్రజాసమస్యలు గాలికొదిలి ప్రజల సొమ్ము కాజేసేవిధంగా నాయకులు తయారయ్యారు. వికసిత్ భారత్ అని మోదీ అంటే వికసిత్ ఆంధ్రా అని చంద్రబాబు అంటుంటే రాష్ట్ర ప్రజలు కూడా అలాగే అనాలి. ఏరూపంలో రాష్ట్రం వికసిస్తుందో నిపుణులు చెప్పాలి. ప్రస్తుతమున్న నిధులతో ఏ రంగంలో రాష్ట్రం వికసిస్తుందో నాయకులు చెప్పాలి. ముఖ్యంగా ప్రజలకు ముందుగా చేయవలసిన పనులు అందుకు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. దిగిపోయిన ప్రభుత్వ నేతలను నిందించడంమాని వారు చేయనిపనులు త్వరితగతిన చేసే పనిలో నిమగ్నం కావడం ముఖ్యం. అది నిజమే బావ గత ప్రభుత్వం ప్రజావసరాలు తీర్చలేదనేవారిని దించిన ప్రజలను ఈ ప్రభుత్వం వారు చేయలేదని చెప్పవలసిన అవసరంలేదు. వారు చేయనిపనులు చేసి ప్రజల మన్ననలు పొందాలి. అప్పుడే పనిచేయని గత ప్రభుత్వ నేతలు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. బాబు ప్రభుత్వం ఏర్పడి నెలన్నర అవుతోంది కనుక గత ప్రభుత్వంపై నిందలు, దాడులుమాని కార్యోన్ముఖులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.