బి. లలితానంద ప్రసాద్ (రిటైర్డ్ ప్రొఫెసర్)
ఆధునిక పాలనా విధానంలో ప్రజాస్వామ్యానికి మించినది మరొకటి లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని అదే పేరుతో వివిధ రూపాల్లో అపహాస్యం చేయడం సర్వసాధారణమైంది. ఇది ఏదో ఒక దేశానికే గాక విశ్వవ్యాప్తంగా ఉంది. ఈ అవాంఛనీయ పరిణామం ఆలోచనాపరులను ఆందోళనకు గురిచేస్తున్నది. అందునా మనిషి జీవితాన్ని, జీవనాన్ని అత్యధికంగా ప్రభావితంచేసి మతం పేరుతో పెల్లుబుకుతున్న ఉన్మాదం ఈ విషయంలో కీలక పాత్ర పోషించటం నేటి విషాదం. ఉన్మాదం ఎవరిదైనా ఉన్మాదమే. ఒకరిది మంచిది మరొకరిది చెడ్డది కాదు. తాజా ‘ఫ్యూ’ పరిశోధన ప్రకారం, అనేక ప్రజాస్వామ్య దేశాలు సైతం నిరంకుశ పాలన విధానాలపై మొగ్గు చూపుతున్నాయి. విశ్వ మానవాళి ప్రయోజనాలరీత్యా అది ఏమాత్రం ఆహ్వానించ తగినదికాదు.
అనాదిగా అనేక మతాలు లేక అందులో శాఖలు పరస్పరం ఎంతగా సంఘర్షించి మారణహోమానికి కారకాలయ్యాయనటానికి చరిత్ర నిండా సాక్ష్యాలు ఉన్నాయి. ఎల్లప్పుడు అవి శాంతి, ప్రేమ, దయ లాంటి మానవీయ గుణాలను ప్రబోధిస్తూ ఉంటాయి. కానీ ఆచరణలో కొందరు ఉన్మాదులు వాటిని అడ్డం పెట్టుకుని ఎందరో అమాయకులపై నిష్కారణంగా వివిధ రూపాలలో దాడులు చేస్తుంటారు. మారణ హోమం సృష్టిస్తుంటారు. ప్రబోధించే వాటికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. మానవత్వాన్ని మంట కలుపుతుంటారు.
కాల గమనంలో మార్పు అనివార్యం. మార్పు, ప్రగతి అవిభాజ్యం. ఆధునిక శాస్త్ర సాంకేతికతలో అవి వేగవంతం అయ్యాయి. ఈ సమస్త మానవాళి సమిష్టిగా సాధించుకున్న పరిజ్ఞానాన్ని అన్ని మతాలవారు అమోఘంగా అనుక్షణం వినియోగించుకుంటున్నారు. అవి ఎవరి సొంతమో కాదు. నిక్షేపంగా వినియోగించుకోవచ్చు. గతంలో వీరు వారిని ఎంత కిరాతకంగా మట్టుపెట్టినా. ఒక పక్క వాటిని నిత్యం గరిష్టంగా ఉపయోగించుకుంటూనే మరో ప్రక్క వాటిని కించపరచడం వారి మానసిక స్థాయికి దర్పణం. వారి ప్రకారం గతం వర్తమానాన్ని నిర్దేశిస్తే భవిష్యత్తు గతం వైపు పయనిస్తుంది. అది తిరోగమనంలో పురోగమనంగా మిగులుతుంది.
ప్రజాస్వామ్యానికి పునాది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇది ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు, అక్కడ ప్రజలు ఏరికోరి ఎంచుకున్న పాలనా విధానం. అత్యంత నాగరికం. ఇందులో ప్రజలే సమస్తము. సర్వస్వం. వారి స్వేచ్ఛకి, సమానత్వానికి, సౌభ్రాతృత్వానికి ఎలాంటి అడ్డంకులు ఏ రూపంలోనూ ఉండరాదు. ప్రజాస్వామ్యం పేరుతో మత రాజ్యాలు ఉన్న దేశాలను వదిలేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశంలో కొంతకాలంగా జన జీవనాన్ని అమితంగా ప్రభావితం గావిస్తున్న, నెలకొంటున్న రాజకీయ, సామాజిక పరిస్థితులు తప్పక పరిశీలనాంశాలు. ఈ గమనానికి అనుగుణంగానే మన గమ్యం ఉంటుంది. రాజ్యాంగంలోని లౌకికానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు.‘తిలాపాపం తలా పిడికెడులా’ స్వేచ్ఛ అనే మాటకు అర్థం లేదు. సర్వత్రా అన్నింటా ఆంక్షలు. ఏమి తినాలి? ఏమి ధరించాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవర్ని వివాహమాడాలి? ఏం మాట్లాడాలి/ రాయాలి? ఎలా ఉండాలి? ఎలా ఆలోచించాలి? సర్వత్ర అదృశ్య నిఘా రాజ్యమేలుతోంది. రహస్య అరాచక/ అనధికార శక్తులకు అనుక్షణం భయపడుతూ లొంగి, వంగి సాష్టాంగ పడుతున్న దయనీయ పరిస్థితుల్లో ఏదైనా ఎవరిదైనా అది స్వేచ్ఛ అవుతుందా? ప్రజాస్వామ్య ఊపిరి అయిన స్వేచ్ఛ లేని చోట సమానత్వం ఉంటుందా? తప్పని పరిస్థితులలో ప్రజానీకం ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది, నెగ్గు కొస్తుంది. కానీ శాంతియుతంగా కలిసిమెలిసి జీవిస్తున్న పౌరుల మధ్య రకరకాల పేర్లతో, రూపాలలో విద్వేషాలు రెచ్చగొడితే వారు ప్రశాంతంగా ఎలా జీవిస్తారు? వైవిధ్యపూరిత, బహుళత్వ సమ్మిళిత సమాజంలో మనుషుల మధ్య సుహృద్భావం పెంచవలసిన వారే స్పర్ధలు పెంచితే ఆ ప్రాంతం ఆ ప్రజలు ఏమైపోవాలి? ఆలకించేది ఎవరు? సహజీవనంలో మైత్రీభావం పెంచవలసిన వారే విద్వేష కర్మాగారాలు నెలకొల్పి నిరంతర ఉత్పత్తి, పంపిణీ కార్యక్రమంలో నిమగ్నం అయిపోతే ఇక ఆ సమాజం ఆ పౌరులు ఏమైపోవాలి? భావోద్వేగాల పేరుతో స్పర్ధలు పెంచి కలిసిమెలిసి ఉండే మనుషుల మధ్య మంటలు రగిలించి చలికాచుకునే వారిని ఏమనాలి? ప్రకృతిలో లేని అందులో భాగాలైన పంచభూతాలకు లేని ఏ ఇతర ప్రాణులలోను లేని సర్వోన్నతుడు అనుకుని మనిషిలోనే ఈ వివక్షతలు, సంకుచితత్త్వం ఎందుకు? ఎంతకాలం కొనసాగుతాయి? వృక్షాలతో సహా ప్రాణాలు అన్నింటిలో అంతర్గత అవయవాల్లో నిక్షిప్తమై ఉండు సంయమనం, సమన్వయం పరిణితి గల, నాగరిక మనుష్యులలో ఎందుకు ఉండదు? ఎలా కొరవడిరది? ప్రపంచంలో కొన్ని మత రాజ్యాలుగా మారుతున్నాయి. కేవలం పేరు మారినంత మాత్రాన అదే రీతిలో చేసేవన్నీ పవిత్రం కావు. ఈ కాలాలకు అతీతంగా ఆచరణలో ఉండగలిగినదే నిజమైన ప్రజాస్వామ్యం. ద్వంద ప్రమాణాలకు అతీతంగా, వ్యక్తిగత నైతికతను, రాజ్యాంగ విలువలను, ఉన్నత సామాజిక ప్రమాణాలను నిజాయితీగా, నిస్వార్ధంగా అంగీకరించి పాటించ దలచిన ఔన్నత్యం గల ప్రతి ఒక్కరికి ఈ సున్నిత అంశాలు అవగతం అవుతాయి. అవ్వాలి. సహనమే సంస్కృతి అనేది అందరికి ఆచరణీయం కావాలి. ‘భారత్ మత రాజ్యాంగా మారుతున్నదా?’ ఇండియా క్రమేపి మత రాజ్యాలైన అందులో తాలిబన్ల పాలైన ఆఫ్గాన్లా, ఇస్లాం నియంతలా రూపొందుతోంది అని ఆక్స్ఫÛర్డ్ చెందిన చరిత్రకారుడు ‘ప్రతినావ్ అనిల్’ తన నెల క్రితం వ్యాసంలోనే పేర్కొన్నాడు. మత రాజ్యంగా ఇండియా పరిణమించడం ఎంతైనా ప్రమాదకరం. ఇది ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అంతటికి గొడ్డలిపెట్టు. దీని కారణంగా మన ఆర్థిక, దౌత్య, భౌగోళిక, రాజకీయ ఆకాంక్షలు ఏ ఒకటి నెరవేరవు. గత రెండు దశాబ్దాలుగా అగ్రరాజ్యంతో కలిసి అడుగులేస్తున్న మన దేశానికి ఈ కారణంగా తీవ్ర విఘాతం కలుగుతుంది. హిందూ జాతీయవాదం అనేది రాజకీయ ప్రాజెక్టు. ఆర్ఎస్ఎస్ 1925లో జాతీయ వాలంటరీ దళంగా( తీవ్ర హిందూవాదులు) ఏర్పడినప్పటి నుండి దాని ఉపాంగ మైన బీజేపీల సంపూర్ణ లక్ష్యం అన్ని కులాల్లోని హిందువులు అందరినీ ఏకం చేయాలనేది. కాలం గడిచే కొలది మన దేశం బీజేపీ హయాంలో హిందూ వర్షన్ ఆఫ్ మలేషియా కావచ్చు అని ప్రపంచవ్యాప్త పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సెల్: 9241499715