Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

కష్టజీవుల పోరుచరిత్ర…

మే డే ఉద్యమ రక్తాక్షరాలు ఇవి. మే డే చరిత్ర పనిగంటల పరిమితికి కష్టజీవులు సాగించిన పోరాటాల చరిత్ర. ప్రాణ త్యాగాలతో ఎరుపెక్కిన చరిత్ర. ఆస్ట్రేలియాలో అంకురించి అమెరికాలో విస్ఫుటించిన మహోద్యమ చరిత్ర. ‘‘కార్మికులకు 8 గంటలు పని, 8 గంటలు వినోదం, 8 గంటలు కుటుంబ అవసరాలు’’ నినాదంతో ప్రారంభమైన ఉద్యమం సాగిన తీరు తెన్నులు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధించిన ఫలితాల చరిత్ర ఇది.
ఆ చరిత్రను ప్రభావితం చేసిన వారు, ఆ చరిత్రకు ప్రభావితం అయినవారు మే డే గురించి ఆయా సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సమాహారమే 92 పేజీల పుస్తకం ‘‘ మే డే చరిత్ర – ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు’’. దేశంలోనే తొలి కార్మిక సంఘం- ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌- (ఏఐటీయూసీి) ఆంధ్రప్రదేశ్‌ శాఖ ఈ పుస్తకాన్ని తీసుకొస్తోంది. ఏప్రిల్‌ 28 ఆదివారం ఉదయ 10 గంటలకు విజయవాడ ప్రెస్‌క్లబ్‌ లో ఆవిష్కరణ సభ జరుగుతుంది. మార్క్సిజం సిద్ధాంత కర్తలలో ఒకరైన ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌, మొదటి కార్మికవర్గ రాజ్య సాధకులు లెనిన్‌, వివిధ దేశాల ప్రముఖ కార్మికవర్గ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు రోజా లక్సంబర్గ్‌, జార్జి డిమిట్రోవ్‌, జూలియస్‌ ఫ్యూజిక్‌, కాస్ట్రో ప్రసంగవ్యాసాలు ఇందులో ఉన్నాయి. స్థూలంగా మే డే ఉద్యమ చరిత్రను వివరించే వ్యాసం పీకాక్‌ ప్రచురణల సంపాదకులు, మార్క్సిస్టు మేధావి ఎ.గాంధీ రచన ‘‘మే డే గాథ’’. అమెరికా పర్యటన సందర్భంగా చికాగో నగరంలో మే డే కీలక పోరాట ఘట్టం జరిగిన ‘‘హే మార్కెట్‌’’ ను సందర్శించిన సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ అమరయ్య రాసిన వ్యాసం ‘‘నెత్తుటి జెండాలు ఎగిసిన రోజది’’. చికాగోలో జరిగిన మే డే ఉద్యమ ప్రదర్శనలు, కార్మికుల పోరాటాలకు సంబంధించి నాటి అమెరికా పత్రికలలో వచ్చిన వార్తా కథనాలు, విశ్లేషణల తీరు తెన్నులను వివరించే మరో వ్యాసం, భారత్‌లో తొలి మే డే వ్యాసాల సమాహార మిది. కార్మికవర్గం ఎదుర్కొంటున్న తీవ్ర ప్రతికూల పరిస్థితులు, ప్రభుత్వాల తీరుతెన్నుల నేపథ్యంలో వస్తున్న ఈ పుస్తకం ప్రాధాన్యతను వివరిస్తూ ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ముందు మాట రాశారు.
శతాబ్ద కాలంగా భారత కార్మికవర్గం పోరాడి సాధించుకొన్న హక్కులు, ఉద్యమాలతో సంపాదించుకున్న చట్టాలు నిర్దాక్ష్షి ణ్యంగా రద్దయిపోతున్న నేటికాలాన, తిరిగి పరిమితులు లేని పనిగంటల విధానాలు చొరబడిన పరిస్థితుల్లో- శ్రమదోపిడీ తిరిగి తీవ్రతరం అవుతున్న సందర్భంలో ఈ పుస్తకం రావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ

(మే డే చరిత్ర – ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు పుస్తకావిష్కరణ ఆదివారం జరుగుతున్న సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img