Monday, May 20, 2024
Monday, May 20, 2024

గుర్తిస్తే మానవవాదులు మన ‘లోనే’ ఉన్నారు!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఈ భూగ్రహానికి గల పెద్ద ప్రమాదం ఏమిటంటే దీన్ని ఎవరో వచ్చి రక్షిస్తారన్న విశ్వాసంతో ఉండడంఈ మాట అన్నది రాబర్ట్‌ ఛార్లెస్‌ స్వాన్‌. తొలిసారి ఉత్తర ధృవం (1989) దక్షిణ ధృవం (1986) వెళ్లి, అక్కడ గడిపి, ప్రకృతిని, జీవరాసుల్ని, మానవాళిని మొత్తానికి మొత్తంగా అన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని బలంగా చెప్పినవాడు. అలాంటివారి అనుభవాల్ని తెలుసుకుని, అందులోంచి మనం గ్రహించాల్సిన విషయం గ్రహించి, మనల్ని మనం, మన సమాజాన్ని మనం పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ అంటాడు ‘‘ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మార్పు మనతోనే మొదలయితే ప్రపంచం అదే మారుతుంది!’’అని! వృద్ధాప్యంలో కన్నబిడ్డలు వదిలేసినా, పూర్వ విద్యార్థులు పూనుకుని, తమ ఉపాధ్యాయురాలిని చేరదీసిన సంఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది. అక్కడ ఒక ప్రైవేటు పాఠశాలలో ఒకప్పుడు ఎంతో తెలివైన ఉపాధ్యాయు రాలిగా పేరున్న ఒక టీచరు కాలక్రమంలో వీధి పాలైంది. స్వంత కొడుకులు, కూతుళ్లు ఆమెను వదిలేశారు. జీవిత చరమాంకంలో ఆమె చాలా కష్టాల పాలైంది. కూడూ, గూడూ లేక వీధుల్లో తిరగాల్సి వచ్చింది. తన వాళ్లంతా ఎక్కడికి వెళ్లారో, ఎక్కడ ఉన్నారో కూడా ఆమెకు తెలియదు. చివరకు బతకడానికి రైల్వేస్టేషన్‌ ముందు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. ఎందరి ఛీత్కారాలకో గురవుతూ, మొండిగా అక్కడక్కడే కాలం గడుపుకోసాగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక పూర్వ విద్యార్థిని గమనించింది. అతి కష్టం మీద గుర్తుపట్టింది. దగ్గరికి వచ్చి వివరాలు అడిగింది. అంతే! ఆమె తనకు పాఠాలు చెప్పిన విద్యా టీచర్‌ అని పూర్తిగా నమ్మింది. తనను దివ్యగా పరిచయం చేసుకుంది. తనది ఏ బ్యాచో, తన బ్యాచ్‌లో ఎవరెవరు ఉండేవారో చెప్పుకుంది. సంభాషణలు సంబంధాన్ని మరింత బలపరిచాయి. ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికిన విద్యా టీచర్‌ జీవితం అలా కావడం ఆ పూర్వ విద్యార్థినికి నచ్చలేదు. ఎంతగానో బాధపడిరది. ఊరికే బాధపడితే లాభమేమిటీ? ఏదో చెయ్యాలని అనుకుంది. ఒకప్పటి ఆ విద్యార్థిని దివ్య ఇప్పుడు ఐఏయస్‌ అధికారి. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి స్నానం చేయించి, వేరే శుభ్రమైన బట్టలిచ్చి, భోజనం పెట్టి పడుకోబెట్టింది. అధికారంలో ఉన్న అధికారి గనుక, దగ్గరలో అన్ని వసతులు ఉన్న చిన్నఇల్లు వెతకండని మనుషుల్ని పంపింది.
తనతో చదువుకున్న పూర్వ విద్యార్థినీ విద్యార్థుల్ని సంప్రదించింది. విషయం వారందరికీ తెలియజేసింది. అంతేకాదు, తన సర్కిల్‌లో ఉన్న పెద్దపెద్ద వాళ్లకు చెప్పి, అందరినీ కదిలించింది. తన విద్యా టీచర్‌ భవిష్యత్తు కోసం కొంత నిధి ఏర్పాటు చేసింది. అలా తమ స్కూలు టీచర్‌కు మంచి జీవితం అందించాలన్న పూర్వ విద్యార్థుల సంకల్పం నెరవేరింది. తను చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుని సమిష్ఠిగా ఒక ప్రయత్నంచేసి విజయురాలైంది ఐఏయస్‌ దివ్య. కన్నవాళ్లు నిర్దాక్షిణ్యంగా ఆమె ఆస్తి కాజేసి, నిస్సహాయురాలిని చేసి రోడ్డున పడేసినా ఒక టీచర్‌, తన విద్యార్థుల సహకారంతో మళ్లీ గౌరవప్రదమైన జీవితంలోకి రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. విద్యా టీచర్‌ తను ఉద్యోగంలో ఉన్నప్పుడు బోధించిన పాఠాల సారాంశం, అందించిన సంస్కారం ఆ పూర్వ విద్యార్థుల్లో పనిచేసింది. ఆమె ఎంత నిజాయితీగా నిబద్దతతో పాఠాలు చెప్పకపోతే, ఆమె తన విద్యార్థినీ విద్యార్థులకు అంత ప్రీతి పాత్రురాలు కాగలదూ? అలా పదేళ్ల తర్వాత కూడా వాళ్లు ఎందుకు తరలి వచ్చారూ? ప్రతి వారిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవవాదులు మనలోనే ఉన్నారు అంటే మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు. మనలో అంటే ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవవాదులేకదా? డబ్బు, అధికారం చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే వాటిని మానవత్వ కోణంలోకి మార్చి, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని బాగు చేయాలనుకోవడం గొప్ప సామాజిక సేవ! మన సమాజంలో ఇలాంటి పనులు ఎంతమంది చేస్తున్నారు? అని నిట్టూర్పులు విడిచి, నిరాశపడకుండా ‘మనమేమైనా చేయగలమా?’ అని ఎవరికి వారు కార్యాచరణకు పూనుకోవాలి. వారి పరిధిలో వారు చేయగలిగింది చేయడానికి సిద్ధపడాలి. మానవవాదులంటే ఎవరో ప్రత్యేకంగా ఉండరు. మన‘‘లోనే’’ ఉంటారు. మన ఆలోచనల్లోనే ఉంటారు. చేయవల్సిందల్లా ‘వారిని’ బయటికి తీయడమే. అంటే ఆ ఆలోచనలతోనే మరో పది మందికి స్ఫూర్తి నందించడం. జిలుగు వెలుగుల సినిమా రంగంలో ఉండి కూడా ప్రజల పక్షాన నిలిచిన నటులు కొందరు మనకుఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వాడు నానాపాటేకర్‌. తన ఆదాయంలో తొంభై శాతం ఛారిటీలకు ఇచ్చారు. గతంలో కార్గిల్‌ యుద్ధ సమయంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. తన ఆదాయంలో ఎక్కువ మొత్తం రైతుల అభ్యున్నతికి ఖర్చుపెట్టారు. కరువుకు గురైన నాలుగు గ్రామాల్ని దత్తతకు తీసుకున్నారు. పేద ప్రజల కొరకే తన జీవితం అన్నట్లుగా అన్ని వేళలా వారికి అండగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఒక్క నానాపాటేకర్‌ గురించి చెప్పుకున్నాం. కానీ, సమాజంలో అక్కడక్కడా ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం మనలోంచే ప్రారంభం కావాలి! అలాగే ఇటీవల కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించి, స్వంత ఖర్చుతో వారిని వారి వారి గమ్యాలకు చేర్చిన ఘనత నటుడు సోనూసూద్‌కు చెందుతుంది. వెండి తెర మీద విలన్లుగా నటించినా, నిజ జీవితంలో గొప్ప హీరోలుగా నిలిచారు. ‘‘ప్రయత్నిస్తూ ఉండే వారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు’’ అని అన్నాడు అలెగ్జాండర్‌ ద గ్రేట్‌.
‘‘జీత్‌ తొ పతా నహీఁ లేకిన్‌ యె చరాగ్‌
కంసె కం రాత్‌ క నుక్సాన్‌ బహుత్‌ కర్‌తా హై’’ఉరుదూ కవి ఇర్ఫాన్‌ సిద్దీఖి. విజయం సంగతి తెలియదు కానీ, ఈ దీపం రాత్రికి చాలా నష్టం కలిగిస్తుంది అని అర్థం. ఇందులో రాత్‌ అంటే రాత్రి. అమానవీయతరాత్రి గాక మరేమిటీ? ఆశ అనే దీపం ప్రయత్నమనే దీపం పట్టుకుని పోతూ ఉంటే చీకట్లు వాటికవే తొలగిపోతుంటాయన్న ఆశావాద దృక్పథం ఈ చరణాలలో ఉంది. సమకాలీనంలో జరుగుతున్న ఘోరాల్ని చూసి బెంబేలెత్తి పోవడంకాదు, ప్రయత్నించి ఎదుర్కుంటూ పోతేనే విజయం వరిస్తుంది. కేరళ కోజికోడ్‌ జిల్లాకు చెందిన శశి తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం బ్యాగుల పరిశ్రమ పెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి యాభై వేలు లోన్‌ (అప్పు) తీసుకున్నాడు. అసలూ, వడ్డీ ఏదీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వెళ్లారు. శశి నిస్సహాయత, కూలిపోయే అతని పాత ఇంటిని చూసి చలించి పోయారు. తొమ్మిది మంది ఉద్యోగులు కలిసికట్టుగా తమ స్వంత డబ్బుతో అతడి ఇల్లు బాగు చేయించి ఇచ్చారు. అంతేకాదు, ఆ బ్యాంకు ఉద్యోగులే తమ స్వంత డబ్బుతో అతడి బ్యాంకు లోన్‌ చెల్లించారు. దేశంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. ప్రతి దేశస్థుడి అకౌంట్‌లో పదిహేను లక్షలు వేస్తానన్నవాడు రెండు సార్లు ప్రధానిగా వెలిగిపోయాడు గానీ, ఇలాంటి ఏ చిన్నపాటి సహాయమూ దేశంలో ఎవరికీ చెయ్యలేదు. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రైతు తీసుకున్న అప్పు సకాలంలో బ్యాంకుకు తిరిగి చెల్లించలేదని ఒక బ్యాంకర్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. ఆ పిటిషన్ను జస్టిస్‌ చంద్రచూడ్‌ కొట్టేశారు. ‘‘రైతు అప్పు చెల్లించలేదని అతన్ని కోర్టుకు లాగుతారా? ముందు అప్పు ఎగ్గొట్టి పారిపోయిన ‘‘పెద్ద దొంగలను’’పట్టుకోండి!’’ అంటూ ఆయన తన తీర్పులో సూచించారు. ప్రకృతి పరిరక్షణ కార్యకర్త డాక్టర్‌ వందనాశివ అంటారు‘‘భూమి హక్కులను రక్షించుకోవడమన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇదే మన కాలంలో మనం జరిపే అతిపెద్ద శాంతి ఉద్యమం. సామాజిక న్యాయాన్ని, మానవ హక్కులను రక్షించడం అందులో భాగమే!’’ ఒక స్థాయికి ఎదిగి ఆలోచించేవారికి మాత్రమే ఆమె మాటలు అర్థమవుతాయి. భూమిలో రైతుకు మాత్రమే కాదు, మనుషులందరికీ ఉన్న సంబంధం గూర్చి అవలోకించగలగాలి. అది మానవవాదులయితే గాని చేయలేరు! ఇండోనేషియాలో ముస్లింలు తొంభయి శాతం. హిందువులు రెండు శాతం. మిగతా ఎనిమిది శాతం ఇతర మతస్థులు. అలాగే అమెరికాలో డెబ్బయి శాతం క్రైస్తవులు. ముప్పయి శాతం ఇతర మతస్థులు. అయినా, ఆయా దేశాల్లో అల్లర్లు లేవు. అక్కడ మతాన్ని అడ్డు పెట్టుకుని ఎవరూ రాజకీయాలు చేయడంలేదు. మెజారిటీలదే రాజ్యం అని కూడా అనడంలేదు. మన భారతదేశంలో ఆరెస్సెస్‌, బిజేపీలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశం హిందువులదేనని అంటున్నారు. మిగతా మతస్థులపై దాడులు చేస్తున్నారు. ఆవు నెయ్యి నిప్పులో తగలేస్తారు. ఆవు మూత్రం మాత్రం తాగుతారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదు. కొందరికి ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది. మరికొందరికి హిందువులు ప్రమాదంలో ఉన్నారని తోస్తుంది. అసలు విషయమేమంటే దేశమే ప్రమాదంలో ఉందన్నది అందరూ గ్రహించాల్సి ఉంది. దీనికి ఒక్కటే పరిష్కారంజాతి, మత, కుల, ప్రాంతీయ భేదాల్ని పక్కకు నెట్టి కలిసిమెలిసి జీవించడమే! మానవవాదులన్నవారు కుల మతాల్ని త్యజించాలి. మానవాభ్యు దయమే ధ్యేయంగా ఆధునిక స్త్రీ పురుషులందరూ కలిసికట్టుగా ఒక మానవ వాద ప్రపంచాన్ని సృష్టించుకోవాలి! డెన్మార్క్‌ వంటి దేశాల్లో విచిత్రమైన గ్రంథాలయాలున్నాయి. అక్కడ మీరు పుస్తకానికి బదులు ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. అతను మీ ఎదురుగా కూర్చుని, మీ బాధలు, వ్యధలు ఓపికగా వింటాడు. మిమ్మల్ని పూర్తిగా చదివేస్తాడు. అంటే ఓపికంగా వింటూ, మీ మానసిక ఒత్తిడిని, వేదనను అతను స్వీకరిస్తూ ఉంటాడన్న మాట! అంతేకాదు, దీని వల్ల మీ అహం, కోపం కూడా తగ్గుముఖం పడతాయి వీటిని ‘‘మానవ గ్రంథాలయాలు’’` అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మానవ గ్రంథాలయాలు ఎనభై అయిదు దేశాలలో ఉన్నాయి. చురుకుగా పని చేస్తున్నాయి. ఎదుటివాడి బాధలు విని, అర్థం చేసుకుని, గాయపడ్డ అతని/ ఆమె మనసు తేలికపడడంలో సహాయపడడమంటే అది మానవత్వమే కదా? మానవీయ విలువల్ని నిలబెట్టడమే కదా? అలాంటి గ్రంథాలయాల్లో మీకు ఎదురుగావచ్చి కూర్చునే వ్యక్తులు మానవవాదులు కాకపోతే మీ వేదనను పోగొట్టలేరు కదా?
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img