Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

తొమ్మిదేళ్లలో సాధించిందేమున్నది?

నీరుకొండ ప్రసాద్‌
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి మే 26 వ తేదికి తొమ్మిదేళ్లు పూర్తి అయింది. దేశ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోదీ అసమర్ధ, అసంబద్ద పాలనా విధానాల ద్వారా దేశ ఆర్ధిక, సామాజిక జనజీవనాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. 2014 ఎన్నికల్లో అభివృద్ది ఎజెండాతో కొత్తతరం నేతగా మోదీ తెరపైకి వచ్చారు. ఆర్భాట ప్రసంగాలు, అమోఘమైన వాగ్దానాలు, హావభావ విన్యాసాలు, ఆచరణ ఎరుగని ఆదర్శాలతో దేశ ప్రజలను బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చిన మోదీ దేశాన్ని అన్నివిధాలా అధోగతి పాలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి అంశాలను ఎన్నికల అస్త్రాలుగా మలుచుకున్నారు. దేశంలోని అవినీతిపరులు దేశ సంపదను లూటీచేసి స్విస్‌ బ్యాంకుల్లో లక్షల కోట్లు దాచుకున్నారని, దాన్ని తెప్పించి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని మోదీ వాగ్దానం చేసారు. దేశంలో అత్యధికమంది ఆధారపడివున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. ప్రభుత్వ విధానాల వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెరిగిపోయాయి. రైతు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు వ్యవసాయాన్నే మానేసే పరిస్థితి తెచ్చారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రరూపం దాల్చి కోట్లాది మంది వ్యవసాయ రంగాన్ని వదిలేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. కేంద్ర నేర పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం 2016లో 11,379 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2017లో 10,655 మంది, 2018లో 10,349 మంది, 2019లో 10,281 మంది, 2020లో 10,677 మంది, 2021లో 10,881 మంది, 2022లో పది వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా వున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీన పరిచారు.
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా మీడియా సమా వేశం జరపలేదు. తొమ్మిదేళ్ల నాడు చెప్పిన దానికి, చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. తొమ్మిదేళ్లుగా అసత్యమేవ జయతే అన్న రీతిగా సాగుతుంది పాలన. వాగ్దానాల వరద పారించారు తప్ప అవి వాస్తవరూపం దాల్చలేదు. ఆకలి, ఆవిద్య, అనారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి వంటి ప్రాధమిక సమస్యలు పరిష్కరించలేక పోయారు. సమాఖ్య భావనకు తూట్లు, రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు, ప్రశ్నించే గళాలకు సంకెళ్ళు నిత్యకృత్యమయ్యాయి. దేశాన్ని తిరోగమనబాట పట్టించారు. కాంగ్రెస్‌ పార్టీకి 60 ఏళ్ళు అధికారం ఇచ్చారు. నాకు 60 రోజులు చాలు అచ్ఛేదిన్‌ తెస్తాను అని దేశ ప్రజలను నమ్మించారు. నేడు అచ్చేదిన్‌ అంటూ ఆశలుపెట్టి ఆవిష్కరించిన సుందర స్వప్నం కరిగి పోయింది. మోదీ పాలన మేడిపండును తలపిస్తుంది. మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీస్‌, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, పసల్‌ బీమా విఫలమయ్యాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన దగా. ఆర్థిక నేరగాళ్ళపై చర్యలు అంటూ ఆర్ధిక నేరగాళ్లను అక్కున చేర్చుకోవడం, చట్టాలను చుట్టాలుగా మార్చుకోవడం, ప్రశ్నిస్తున్న వారి గొంతులు నులమడం వంటి చర్యలతో పాలన సాగించారు. తొమ్మిదేళ్లుగా గతాన్ని తవ్వడం తప్ప దేశానికి తాను ఏం చేశారో మోదీ చెప్పలేని దుస్థితి. తాను మాత్రమే దేశ భక్తుడుగా ప్రచారం చేసుకొంటారు. ఏది రాజకీయంగా ఉపయోగపడితే దానిని ఉపయోగిం చుకొన్నారు. దేశాభివృద్దే లక్ష్యంగా తానూ పనిచేస్తున్నానని మోదీ చెప్పే మాటలు డొల్ల అని తొమ్మిదేళ్ల పాలన రుజువుచేసింది. 2016 లో పెద్దనోట్లు రద్దుతో నల్లధనం రూపుమాపుతాం, అవినీతి అంతం అవుతుంది అన్నారు. 2017లో సర్జికల్‌ స్ట్రైక్‌ తరువాత దేశంలో ఉగ్రవాదం వుండదు అన్నారు. 2018లో జిఎస్టీితో అద్భుతాలు జరిగి ధరలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కాశ్మీర్‌ ప్రశాంతంగా వుంటుంది అన్నారు. 2020లో 21 రోజులు ఇంట్లో వుండండి, దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి కరోనా పారిపోతుంది అన్నారు. 2020లో నన్ను నమ్మండి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితేనే దేశం బాగుపడుతుంది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బీమా సంస్థలు, రైల్వేలు, పోర్టులు ఇలా అనేక వ్యవస్థలను అమ్మకానికి పెట్టారు. మేడ్‌ ఇన్‌ ఇండియా అంటు ఊదర గొట్టి సేల్‌ ఇండియా చేస్తున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు, వంటగ్యాస్‌ ధరలు, వంట నూనెల ధరలు మంటలు మండుతున్నాయి. ఆ మంటల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలు విలవిలలాడుతున్నాయి. మోదీ పాలనకు ముందు వంట గ్యాస్‌ రూ.405 ఉంటే నేడు రూ.1175 అయింది. పెట్రోలు రూ.70 నుండి 110కి, డీజల్‌ రూ.55 నుండి రూ.97కు, వంట నూనె రూ.83 నుండి రూ.175కు పెరిగిపోయాయి. డీజీలు,పెట్రోలు ధరలు పెరగడంతో వ్యవసాయ అనుబంధ రంగాలు పూర్తిగా దివాళా తీసాయి. రైతులకు ఏం చేయాలో దిక్కు తోచడంలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ఎన్నికల హామీ నెరవేరలేదు. మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, గరీబ్‌ కళ్యాణ్‌ యోజన, ప్రధానమంత్రి కృషి సంచయ్‌ యోజన, వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌, ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ అంటూ నోరు తిరగని ఆర్భాటపు ప్రకటనలతో కడుపునింపుతున్నారు. ప్రపంచ ఆహార సూచికలో భారత్‌ 107వ స్థానానికి చేరింది. అవినీతి, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం, ప్రజాస్వామ్య హక్కులపై దాడి, న్యాయస్థానాలను బలహీనంచేసే చర్యలు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించిన వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పులు 2021 డిసెంబర్‌ నాటికి రూ 135 లక్షల కోట్లకు చేరగా, 2023 నాటికి 155 లక్షల కోట్లకు చేరనున్నాయని అంచనా. అంటే దాదాపు ప్రతీ నెలా రూ.83 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులన్నీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏమవుతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానం లేదు. పదే,పదే అధికారం చేజిక్కించుకునేందుకు ఉచిత పథకాలు అనర్హులకు అందించి దేశాన్ని అప్పులపాలు చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇంత అప్పుచేసి దేశానికి ఏం చేసినట్లు? ఇంత అప్పు వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో మోదీ చెప్పగలరా? భారత్‌ రేటింగ్‌ మాదిరి మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌ అప్పు ఎంతో ఎక్కువగా వుందని మూడీస్‌ రేటింగ్‌ సంస్థ వెల్లడిరచింది. అభివృద్ది చెందుతున్న దేశాల్లో కెల్లా భారత దేశంలోనే అత్యధికంగా ప్రజలు పేదరికంలోకి జారుకున్నారని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడిరచడంతో మోదీ ప్రసంగాలు, పరిపాలన అంతా డొల్ల అని తేలిపోయింది.
` సెల్‌: 9849625610

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img