సురవరం సుధాకరరెడ్డి
సీపీఐ పూర్వ ప్రధాన కార్యదర్శి
ఎన్నికల ఫలితాల తర్వాత అనేక విశ్లేషణలు వచ్చాయి. ఇంకా వస్తాయి. కేంద్రంలో బీజేపీ పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గటం అనేకమందికి ఒక రిలీప్. తనకుతాను దైవ దూతగా ప్రకటించుకున్న నరేంద్ర మోదీ అహంకారానికి దెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్థుల మీద అనేక అన్యాయమైన ఆరోపణలు చేశారు. ‘‘కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని కూల్చి వేస్తారని’’, ‘‘హిందూ మహిళల పుస్తెలు లాక్కొని ముస్లింల కిస్తారని’’ ఆయన చేసిన దుష్ప్రచారం పనిచెయ్యలేదు. కాని ప్రధాని స్థాయిని దిగజార్చింది. మోదీ ప్రచారం, అమెరికా వియత్నాంపై దాడిలో ‘‘కార్పెట్ బాంబింగ్’’ చేసిన విషయం గుర్తుకువస్తుంది. కార్పెట్ బాంబింగ్ అంటే గెరిల్లా యోధులను ఏరివేయటానికి వియత్నాంలో ప్రతి అంగుళం భూభాగంపైన బాంబులు వేసింది. నేపాల్మ్ బాంబులు ఉపయోగించింది. విత్తన బంతులులాగ గుండుసూదుల బంతులు తయారుచేసి గ్రామాలమీద వేసింది. విషవాయువును ఉపయోగించింది. అయినా ఓడిపోయింది. అది వేరే కథ.
మోదీ ప్రతిపక్షపార్టీలను చీల్చారు. చిన్న పార్టీలను బలహీనపర్చారు. దగ్గరకు తీసినట్లే తీసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. పంజాబ్లో అకాలీదళ్ని, హర్యానాలో చౌతాలా పార్టీని తీసిపారేశారు. దిల్లీ ముఖ్యమంత్రిని, జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్టుచేసి జైల్లో పెట్టించారు. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టుచేసి జైల్లో పెట్టించారు. మధ్యప్రదేశ్లో, గుజరాత్లో కాంగ్రెస్ నాయకులను తన పార్టీలో తీసుకోవడమేగాక, వారి అభ్యర్థులను కొనుగోలుచేసి పోటీచేయకుండా ఉపసంహరింపచేశారు. మహరాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాడు. వారి ప్రభుత్వాన్ని పడగొట్టాడు. కాంగ్రెసు మేనిఫెస్టో ముస్లింలీగ్ మేనిఫెస్టోలాగ ఉందని ప్రచారం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఇన్కంటాక్స్ దళాలను అల్సేషన్ కుక్కలలాగ ప్రత్యర్థులమీద ప్రయోగించాడు. నలభైఏళ్లనాటి కచ్చీతీవును, కాంగ్రెస్, డి.ఎం.కె. శ్రీలంకలకు దారాదత్తం చేశాయనీ, మత్స్యకారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపైన ఒక తప్పుడు కేసు రుద్దాడు.ఎన్నికల కమిషన్లో సభ్యులను నియమించే చట్టం మార్చి, ఒకసభ్యునితో రాజీనామా చేయించి, తననుకూలమైన సభ్యులను నియమించుకున్నాడు. సర్వసైన్యాధిపతి రిటైర్ అయితే ఒక నెల పొడిగించడం అనేక అనుమానాలకు దారితీసింది. ప్రశ్నిస్తే సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగుతారా అని ఆగ్రహించారు. గోబెల్స్ సిగ్గుపడేవిధంగా అవలీలగా అబద్ధాలు చెప్పాడు.
ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. దేశవ్యాపితమైన ప్రచారం దీటుగా సాగించింది. కాని సంపూర్ణ ఐక్యత రాలేదు. ఇండియాకూటమి బలం పెరిగింది. ఇండియాకూటమి బలం పెరిగేందుకు యూపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర తోడ్పడ్డాయి. తెలంగాణలో, రాజస్థాన్లో, కర్నాటకలో కాంగ్రెస్ సీట్లు పెరిగాయి. కాని కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో తగినన్ని సీట్లు రాకపోవడంపై వారు సమీక్షించుకోవాలి. బీజేపీ, బీహార్, గుజరాత్ బాగా సహాయపడ్డాయి. నాగాలాండ్లో, పుదుచ్చేరిలో, లక్షద్వీప్లో, మణిపూర్లో కాంగ్రెసు సీట్లు గెలవడం, గోవాలో బీజేపీ ఒక సీటు గెలవడం, కాంగ్రెస్ పునరుద్ధరణకు దోహదపడుతుంది. అయోధ్యలో ఒక సీటు ఓటమి రామాలయం నాటకం పనిచేయలేదని అర్థమవుతుంది. అధికారానికి 63 మంది సభ్యుల తేడా దూరంలో ఉన్నారు. బీజేపీ 200 సీట్లకు పరిమితమై చంద్రబాబు, నితీశ్ల ఊతకర్రల సహాయంమీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. చంద్రబాబు రెండు పర్యాయాలు, నితీశ్కుమార్ మూడు పర్యాయాలు, ఎన్డీఏ లోకి వెళ్లి బైటకు వచ్చినవారే. నమ్మకం లేని సహచరులని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికి అలాంటి ప్రమాదంలేదు. అవకాశము లేదు. కానివారు బీజేపీని పూర్తిగా నమ్మరు. బీజేపీ వాళ్లను నమ్మదు.
బీజేపీని బైటనుండి బలపరచిన వైసీపీ, భారతీయ రాష్ట్రసమితి, ఆల్ ఇండియా అన్నాడీఎంకె పార్టీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదళ్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిపని అయిపోయిందని భావించడం సరైందికాదు. పుంజుకునే అవకాశాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు, నితీశ్ చక్రం తిప్పుతారని, అనేక మంత్రి పదవులు కోరుతున్నారని స్పీకర్ కూడా బాబు కోరుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. బీజేపీ స్పీకరు పదవిని ఇవ్వదు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వదు. టీడీపీ, జేడీయూ లేకపోయినా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని మంత్రి పదవులు ఒక్కొక్క పార్టీకి రెండు, మూడు ఇవ్వవచ్చు. ఏడుగురు స్వతంత్రులున్నారు. ఇద్దరు టెర్రరిస్టు ఆరోపణలతో ఉన్నారు. వారు బలపరిస్తే వారు జైళ్ల నుంచి బైటకు వస్తారు. ఇతరులను కొనవచ్చు. అకాలీదళ్ ఇండియా కూటమిలోకి వెళ్లలేదు గనుక బీజేపీతో ఉండవచ్చు. కేసుల భయంతో జగన ్కూడా ఎన్డీఏకు మద్దతు ఇవ్వవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఎంపీలు కాంగ్రెస్తో సహా ఇండియా కూటమిలో కూడా ఉండవచ్చు.
కొత్త ప్రభుత్వం సంకీర్ణం కనుక దూకుడు తగ్గవచ్చునన్న అభిప్రాయం కొందరిలో ఉంది. ఏడవతేదీన ఎన్డీఏ పార్లమెంటు సభ్యులు మిత్రపక్షాల నాయకులతో పాత పార్లమెంటు భవనంలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ ఉపన్యాస ధోరణిని బట్టి అలాంటిదేమీ ఉండకపోవచ్చు. వాగాడంబరం ప్రతిపక్షాల మీద దాడి పాతపద్ధతి లోనే కొనసాగింది. ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసినా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతానని పట్టుబట్టినా, ఆంధ్రప్రదేశ్లో బేజేపీని మూడు సీట్లలో గెలిపించారు. ఆంధ్రలో ఎవరుగెలిచినా బీజేపీకి మద్దతిస్తారని ముందు నుంచి అనుకున్నదే. చంద్రబాబు మీద కేసులు పెట్టి జైలుకు పంపి భయానక వాతావరణం సృష్టించి, చంద్రబాబును, బీజేపీతో ఎన్నికల ఒప్పందానికి జగన్ మోహన్ రెడ్డి నెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు, వామపక్షాలు పుంజుకోలేకపోవడం, రాష్ట్ర రాజకీయాలకు నష్టం కలిగిస్తుంది.‘‘కాంగ్రెసు రహిత భారతదేశం’’ అన్న అమిత్ షా నినాదం కార్యాచరణలోకి రాకపోగా, ఆ పార్టీ మరింత బలోపేతమైంది. అసలు యుద్దం రాబోయే రోజుల్లో ఉంది. వామపక్షాలు చాలా స్వల్పంగా 5 నుంచి 8 స్థానాలకు (ఆర్ఎస్పి) తో కలుపుకుంటే 9 స్థానాలకు పెరిగింది. ఇది చాలదు. కేరళలో వామపక్షాలకు ఒక్క సీటు మాత్రమే రావడం దిగ్భ్రాంతి కలిగించింది.
కాంగ్రెసు అధికారంలోకి వచ్చినా మౌలిక సమస్యలు పరిష్కారం లేదన్నమాట వాస్తవమే. అయినా గుడ్డికంటే మెల్ల కన్ను మేలన్నట్లుగా పెద్దశత్రువును ఓడిరచేందుకు, ప్రతిపక్ష బూర్జువా పార్టీలను బలపరచడం వామపక్షాలకు అనివార్యం.
మనదేశంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పరిమితులున్నాయి. సంవత్సరాల తరబడి తప్పుడు కేసుల్లో మేధావులను అరెస్టుచేసి, చార్జిషీటులు లేకుండా, బెయిల్ లేకుండా చేస్తున్న పరిస్థితుల నుంచి బైటపడేందుకు కోర్టులకు ధైర్యం కావాలి. నిజాయితీ అధికారులకు సాహసం పెరగాలి. భావ ప్రకటనాస్వేచ్ఛను, ఊపిరి తీసుకునేందుకు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, పోరాటాలు సాగించేందుకు, అబద్దాల నుంచి, అసత్యాల నుంచి, తప్పుడు దాడుల నుంచి, కుహనా దేశభక్తుల నుంచి ఫాసిస్టు ధోరణలు నుంచి, దేశాన్ని కాపాడేందుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వంవస్తే, అవకాశాలు పెరుగుతాయని ప్రజలు విశ్వసించారు. బలమైన ప్రతిపక్షం ప్రజలలో కొంతవరకు విశ్వాసాన్ని నింపుతుంది. వామపక్షాల పోరాటాలు రానున్న కాలంలో ముఖ్యం. అధిక ధరలమీద, నిరుద్యోగం మీద, దళితులు, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల రక్షణకోసం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు తక్షణావసరం. భిన్న భాషలు, మతాలు, సంస్కృతుల భారతదేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుకునేందుకు వామపక్ష, సెక్యులర్ ప్రజాతంత్ర పార్టీల, శక్తుల ఐక్యతతో పోరాటం సాగించాలి.