Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైద్య విజ్ఞానంపై ఆసక్తితో రాశా : ఎమ్‌.హేమలత

సాహిత్యమయితే శాస్త్రం కాదు. శాస్త్రమయితే సాహిత్యమూ కాదు. రెండిరటి ధర్మాలు వేరు వేరుగా ఉంటాయి. కానీ, శాస్త్రాన్ని సాహిత్యంలో ఇమిడ్చి చెప్పగలిగితే పాఠకుల హృదయాల్లో పూవులా వికసించి గుబాళిస్తుంది శాస్త్రం. జనరంజకమైన శైలిలో, కాల్పనికంగా, శాస్త్ర విషయాన్ని మంచి కథా రూపంలోనో, నవల రూపంలోనో అందించే ప్రక్రియని సైన్స్‌ ఫిక్షన్‌ అంటారు. సైన్స్‌ ఫిక్షన్‌ తెలుగు భాషలో కన్నా ఇతర భాషల్లోనే ఎక్కువగా వచ్చిందన్న సంగతి నిర్వివాదాంశం. సంవత్సరాల తరబడి పరిశోధనలు చేసి, చక్కటి సైన్స్‌ ఫిక్షన్‌ రచనలు చేసిన ఆంగ్ల రచయిత లెందరో ఉన్నారు. వారికి తగిన ఆదరణ, ఆర్థిక, సామాజిక సుస్థిరత లభించింది. ఫిక్షన్‌ ఉన్నంతగా, తెలుగులో సైన్స్‌ ఫిక్షన్‌ ఉందా అనేది సందేహాస్పదమే! ప్రచురణా ప్రోత్సాహం, చదివే పాఠకులు, ఒకింత పరిశోధించి రాసే రచయితలు లేకపోవడం కారణాలు కావచ్చు. సైన్స్‌ ఫిక్షన్‌ కథల గురించి విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేస్తున్న విద్యార్థుల కోసం కొన్ని కథలు రాశాను. నేను రాసిన సైన్స్‌ ఫిక్షన్‌ కథలను – వైద్య విజ్ఞానకథలు, మనోవైజ్ఞానిక కథలు అంటూ- రెండుభాగాలుగా విభజించవచ్చు. గొడ్రాలు (1972), పూర్వజ (1973), ప్రభ (1975), కన్నతల్లి (1979), ప్రతిబింబం (1995), పెంపుడు కొడుకు (1978), అమ్మకు అభినందనలు (1999), మెర్సీ కిల్లింగ్‌ (2000), సూపర్‌ ఉమన్‌ (2001), చివరకు మిగలనిది (2002). ఈ కథలన్నీ ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వారపత్రిక, విపుల లాంటి అనేక వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
మద్రాసు (చెన్నై) ప్రెసిడెన్సీ కాలేజీ నుండి 1957లో ఎం.ఏ (తెలుగు-భాష, సాహిత్యం) లో పట్టా పొందిన నేను దాదాపు ఆనాటి నుండే తెలుగులో కథలు, వ్యాసాలు, నవలలు, నాటికలు రాస్తున్నాను. పుంఖాను పుంఖంగా రచనలు చేయడం నా ప్రవృత్తి కాదు. కంటపడ్డ ప్రతి రచన చదవడం మాత్రం ఈనాటికీ నా హాబీగా చెప్పుకుంటాను. పాతతరం సాహితీ వేత్తలకు బహుశా నేను జ్ఞాపకం ఉండి ఉంటాను. స్వతహాగా నాకు వైద్య విజ్ఞానంపై ఆసక్తి ఎక్కువ. ఆ తృష్ణే నన్ను వైద్యపరమైన కథలురాయడానికి పురి కొల్పింది. కథలన్నిటికీ ఆసక్తికరమైన నేపథ్యాలు, ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి.
1960 దశకంలో (1964) శ్రీవారి ఉద్యోగ రీత్యా తెనాలి పట్టణంలో ఉండేవాళ్ళం. పదేళ్ళ మా పక్కింటి అమ్మాయి ఓ రోజు స్కూలు కెళుతూ, ‘‘అత్తయ్యా! నాకు జడ వేయరూ..? ‘‘ అంటూ నా వద్దకు వచ్చేది. జడవేస్తూ, నా ముందు కూచున్న అమ్మాయి వీపు మీద గుండ్రంగా ఉన్న ఎర్రటి వాతల్ని చూచి ఆశ్చర్యపోయాను. ‘‘ఏంటమ్మా! నీ వీపు మీద ఈ వాతలు ఎలా పడ్డాయి? అన్న నా ప్రశ్నకు ఆ అమ్మాయి చెప్పిన జవాబు విని నిశ్చేష్టురాలి నయ్యాను. ‘వాళ్ళమ్మకి తన తర్వాత ఇద్దరు మగ పిల్లలు పుట్టారట – వాళ్ళిద్దరూ పుట్టీపుట్టగానే చనిపోయారట… అందుకు వాళ్ళ నానమ్మ తన వెన్ను మంచిది కాదంటూ, తనను నిందించి, తన వీపు మీద వేడి వేడిగా ఏడట్లు వేసిందట. ఇది జరిగాక వాళ్ళమ్మకి వరుసగా ఇద్దరు మగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారట! అందరూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారట.’’ ఇదెక్కడి విడ్డూరం? ఇలా కూడా జరుగుతుందా ఎక్కడైనా? ఆనాటి నుండి నా ఆలోచనలు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ, పరిభ్రమిస్తూ వుండేయి. కొన్నేళ్ళ తర్వాత మా వారు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు వారి కోలీగ్‌ భార్య ద్వారా ఒక విషయం తెలిసింది. అదేమిటంటే – తనకి మొదటి సంతానం తర్వాత పుట్టిన రెండవ బిడ్డ వెంటనే చనిపోవడంతో – ఆ తర్వాత పుట్టిన బిడ్డను కాపాడుకోవాలని, హైదరాబాద్‌ వెళ్ళి, ఓ ప్రైవేటు హాస్పిటల్లో, ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండా పురుడు పోసుకుందట. మొదటి సంతానం తర్వాత ఇలా రెండవ కాన్పులో పుట్టిన బిడ్డలు చనిపోవడంలోని రహస్యం నాకు బోధపడలేదు. ఎందుకిలా జరిగింది? ఈ విషయమై డాక్టర్లతో చర్చించాను. నా సందేహాలు పూర్తిగా నివృత్తి కాలేదు.
మెడికల్‌ జర్నల్స్‌, వైద్య సంబంధమైన కొన్ని పుస్తకాలు తిరగేసాను. తర్వాత, నాకు విషయం సుబోధమైంది. భార్యాభర్తల రక్తంలో గల రక్త వైరుధ్యాల కారణంగా ఈ సమస్య తలెత్తుతుందనీ, తల్లి రక్తాణువులు, పుట్టబోయే బిడ్డ ఎర్రరక్తాణువులను విరిచేసే కారణంగా శిశువు కామెర్లతో జన్మించడమో, మృత శిశువుగా పుట్టడమో జరుగుతుందని తెలిసింది. ఇలా పుట్టిన బిడ్డల్ని ‘‘రీసెస్‌ శిశువులు’’ అనీ, ఈ వ్యాధిని ‘‘హెమాలిటిక్‌ అనీమియా’’ అనీ అంటారు. స్త్రీలకు తొలి కాన్పు తర్వాత ‘‘యాంటీ – డీ’’ అనే ఇంజెక్షన్‌ ఇచ్చి, మలి కాన్పు శిశువులు మరణం పాలు కాకుండా కాపాడవచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న నేను ఈ రెండు ఘటనల నేపథ్యంతోనూ ‘పూర్వజ’ అనే వైద్య విద్య విజ్ఞాన కథ రాశాను. ‘పూర్వజ’ అంటే అర్థం – అక్క. ముందు పుట్టినది. ఈ కథను నేను ఉత్తమ పురుషలో రాసాను. తను చేయని తప్పుకు మనోవేదనా, శరీర వేదన అనుభవించి, దురదృష్ట జాతకురాలిగా అపకీర్తి మూటగట్టుకున్న పూర్ణిమ కథకు ఓ ఆశాజనకమైన ముగింపు నిచ్చాను. గర్భిణులందరూ తప్పనిసరిగా ఆచరించవలసిన విషయం – వాళ్ళ రక్తంలోని రీసెస్‌ గ్రూపింగ్‌ ఏమిటో తెల్సుకొనేందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. నూటికి పదిహేను మంది స్త్రీలలో Rష్ట్ర (ంఙవ) రక్తం ఉంటుంది. అలాంటి స్త్రీలు, మొదటి కాన్పు అయిన తరువాత యాంటీ – డీ (AచీుI -ణ) అనే ఇంజక్షన్‌ తీసుకొని, తర్వాత కాన్పుల్లో జన్మించే శిశువులు చనిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ విషయాలను వెల్లడిస్తూ 48 ఏళ్ళ క్రితం రాసిన ‘పూర్వజ’ కథ ‘‘యువ’’ మాస పత్రిక (అక్టోబరు 1973 సంచిక) లో ప్రచురితమైంది. నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
నేను రాసిన మరో వైద్య విజ్ఞాన కథ అమ్మకు అభినందనలు. ఇది ఆటిజం నేపథ్యంతో రాసిన కథ. ఆటిజం అనే రుగ్మత ఒకటుందనీ, అది పిల్లలకు వచ్చే ప్రత్యేకమైన జబ్బు అనీ, చాలా మందికి అవగాహన లేని రోజులవి (1980 దశకం). సరిగ్గా అప్పుడే నా సన్నిహిత స్నేహితురాలి మనవడు, రెండేళ్ళ బాలుడు మిగతా పిల్లల కన్నా విరుద్ధంగా ప్రవర్తించ సాగాడు. తన వయస్సు గల ఇతర పిల్లల్లాగా లేడని నాకు చెప్పి బాధపడిరది. పుట్టినప్పటి నుండి వాడి అభివృద్ధి దశలు చాలా నిదానంగా ఉన్నాయనీ, డాక్టర్లని సంప్రదిస్తే కొంతమంది పిల్లలు అలాగే ఉంటారని, అదేమంత అసహజం కాదని చెప్పడంతో కొన్నాళ్ళు అలక్ష్యం చేసామని చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పిల్లవాడిలో ఏ మాత్రం ఇంప్రూవ్‌మెంటు కనబడలేదనీ, తన లోకంలో తాను జీవిస్తూ కాలం గడిపేస్తున్నాడని చెబుతూ, కొంత ఆందోళన చెంది శిశువైద్య నిపుణులను సంప్రదిస్తే, వాళ్ళు ఓ మారు బెంగుళూరు తీసుకెళ్ళి నిమ్‌హాన్స్‌ డాక్టర్లను సంప్రదించమన్నారని చెప్పింది. ‘‘ఆటిజం’’ అనే పేరే నిజానికి నాకూ వింతగా, విచిత్రంగా, కొత్తగా అన్పించింది. ఉండవలసిన సాధారణ తెలివితేటలు కొరవడి, వయస్సుకు తగిన మానసిక వికాసం లేక మందకొడిగా ఉండే పిల్లవాడిని, ముప్పై, నలభై ఏళ్ళ క్రితం (ఆ మాటకొస్తే – ఈ నాటికీ కొన్ని సామాజిక వర్గాల్లో) వెర్రి బాగులవాడనీ, వెర్రివెంగళప్పనీ ముద్ర వేసి, హేళన, నిర్లక్ష్యం, చేయడం నాకు అనుభవైకవేద్యమే. ఆటిజం అంటే ఏమిటి…? బిడ్డ ఎదుగుతున్నప్పుడు, శరీరం వికాసాత్మక పరిణామం చెందుతున్నప్పుడు, సంభవించే తీవ్రమైన అవరోధాన్ని ‘ఆటిజం’ అని నిర్వచించవచ్చు. బాగా అర్థం చేసుకోడానికి కొంత పరిశోధన చేయవల్సి వచ్చింది. డౌన్స్‌ సిండ్రోమ్‌ గురించి, డిస్లెక్సియా గురించి కొంత అవగాహన ఉండేది నాకు. ఇలా కాదని ఇంటర్నెట్‌ని ఆశ్రయించి ఆటిజంని గురించిన విశేష సమాచారం సేకరించాను. ప్రపంచంలో ఈ వ్యాధితో బాధపడున్నవారు, వారిని ఎలా చీవaతీ అశీతీఎaశ్రీ షష్ట్రఱశ్రీస గా తీర్చిదిద్దుకోవచ్చో – ఇందుకు సమాజం, తల్లిదండ్రుల – అందులో ముఖ్యంగా తల్లి పాత్ర ఎంత అనే విషయాల మీద కేస్‌ స్టడీస్‌ పరిశీలించాను. నాకు బాగా తెలిసిన శిశువైద్యులతోనూ చర్చించాను. తర్వాత కథ రాయడం ప్రారంభించి, ముగించే సరికి అది సాధారణ కథ కన్నా కొంచెం పెద్ద కథ అయింది. ఆటిజం లాంటి అబ్‌ స్టార్ట్‌ మెడికల్‌ సబ్జెక్టు మీద కథ అల్లడం ఓ విధంగా కత్తిమీద సాము చేయడం లాంటిది.
ఈ కథను రాయడంలో నేను కొంత వరకు సఫలీకృతురాలనయ్యాననే భావిస్తున్నాను. కథను నడిపిస్తున్నప్పుడు, శాస్త్ర సంబంధిత విషయాలు అవసరానికి మించి కథలో ఇమిడ్చి రాస్తే, అది కథ అన్పించుకోదు. ఓ వ్యాసమౌతుంది. చదివేవారికి విసుగు కల్గిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని కథ రాసాను. ఆటిజం అనేది మానసిక రుగ్మత కాదనీ, జాగ్రత్తగా ట్రీట్‌ చేస్తే తగ్గిపోతుందనీ, ఇందుకు ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా తల్లి సహకరించాలనీ చెబుతుంది కథలోని డాక్టర్‌ సునంద పాత్ర. నిజం చెప్పాలంటే అమ్మలందరూ అభినందనీయులే, అందులోనూ ఆటిజం అనే రుగ్మతతో బాధపడే చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడిని చేసిన ఆ తల్లి మరీ ఎక్కువ అభినందనీయురాలు. దువ్వూరి శారదాంబ స్మారక పోటీ కథలకు ఎన్నికై, ‘కథా మహల్‌ – 1995’లో ప్రచురించిన ఈ కథను చదివి పలువురు రచయితలు, వైద్య నిపుణులు ప్రశంసించారు.

డా. నాగసూరి వేణుగోపాల్‌, జి. మాల్యాద్రి సంపాదకత్వంలో విజ్ఞాన ప్రచురణలు 2017లో వెలువరించిన ‘‘సైన్స్‌ ఎందుకు రాస్తున్నాం’’ సంకలనం నుంచి’’

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img