కూన అజయ్బాబు
గడిచిన నాలుగైదు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులపైన, వారి హక్కులపైన దాడులు పెరిగాయి. నిర్బంధకాండ ఎక్కువైంది. పత్రికలు, ఛానల్స్తోపాటు యూట్యూబ్, వెబ్సైట్ల ద్వారా పౌరపాత్రికేయం చేస్తున్న వారి హక్కుల హననం నిరంతరాయంగా సాగుతోంది. చివరకు ఫాసిస్టు శక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురవుతున్నారు. ఫిలిప్పైన్స్లో సీనియర్ పాత్రికేయుడు, రేడియో వ్యాఖ్యాత రేనాటే ‘రే’ కోర్టెస్ను తన బరాంగే మంబాలిన్లోని రేడియో స్టేషన్ ఎదుటే కొందరు దుండగులు కాల్చిచంపేశారు. ఆ దేశంలో మీడియా సెక్యూరిటీపై ప్రెసిడెన్షియల్ టాస్క్ఫోర్స్ అనే ప్రత్యేక దళం కూడా వుంది. 2006లో కూడా కోర్టెస్పై హత్యాప్రయత్నం జరిగినట్లు ఫోర్స్ అధికారులు వెల్లడిరచారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంపై ఆయనకు ఆసక్తి ఎక్కువగా వుండటమే ఈ హత్యకు కారణమని తెలిసింది. అప్పటికే రెండు రోజులుగా ఇద్దరు వ్యక్తులు (ఇందులో ఒకరు మహిళ) రేడియో స్టేషన్ ముందు రెక్కీ నిర్వహించి, కాపుకాసి, కాల్చిచంపారు. జర్నలిస్టులకు రక్షణ పెంచాలని, వారి హక్కులను కాపాడాలని అక్కడి జాతీయ పాత్రికేయుల సంఘం (ఎన్యుజెపి) డిమాండ్ చేస్తున్నది. థాయ్లాండ్లో భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ తాజాగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. మన మోదీగారికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాలనకు సంబంధించిన రాయల్ డిక్రీలో సెక్షన్ 9 కింద అత్యవసర పరిస్థితుల్లో తప్పుడు అవగాహన కలిగేలా ఎలాంటి సమాచారం ఇచ్చినా కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వుంటుందని పేర్కొంటూ చట్టం చేశారు. ఈ తరహా చట్టాల ఉద్దేశం కచ్చితంగా భావస్వేచ్ఛకు కోత పెట్టడమే. థాయ్లాండ్ జాతీయ పాత్రికేయుల సంఘం (ఎన్యుజెటి)తోపాటు ఆరు థాయ్ మీడియా సంఘాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరు మొదలుపెట్టాయి.
మలేసియాలో జులై 26న అక్కడి కాంట్రాక్ట్ ఉద్యోగులు ‘వాకౌట్’ పేరుతో ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులను పోలీసులు అడ్డుకొని, రభస చేశారు. దీంతో మలేసియా జాతీయ మానవహక్కుల కమిషన్ (సుహాకమ్) వెంటనే జోక్యం చేసుకొని పాత్రికేయులకు అనుమతివ్వాలని ఆదేశించింది. ఏ ఒక్క జర్నలిస్టు కూడా సర్కారు ఆగడాలకు సంబంధించిన ఏ ఒక్క నిజాన్నీ వెలికితీయకూడదన్నది ప్రభుత్వాల పరమోద్దేశమని అర్థమవుతున్నది. బంగ్లాదేశ్లో డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్ (డిఎస్ఎ) పేరుతో పత్రికా స్వేచ్ఛకు నిర్బంధాలు సృష్టించింది. కొవిడ్ విషయంలో ఒక ఆసుపత్రి, అధికారుల అవినీతిని బట్టబయలు చేసినందుకు ముగ్గురు జర్నలిస్టులపై జులై 10న కేసు పెట్టారు. బంగ్లా ఆర్టికల్ 19 ప్రకారం, డిఎస్ఎ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్ల కాలంలో 457 మందిని ప్రాసిక్యూట్ చేయగా, వారిలో 198 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. వారిలో 75 మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులు. ఫిలిప్ఫైన్స్లో జులై 1న జరిగిన ఒక విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ మాస్క్ తీసి మాట్లాడాలని (కొవిడ్ కాలంలో) అధ్యక్షుడు రోడ్రిగో డుషెర్షే ఆదేశాలు జారీ చేశారు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో 2020 నవంబరు నెలలో ఇద్దరు పాత్రికేయులు హత్యకు గురికాగా, 9 పత్రికాసంస్థలకు బెదిరింపులు వెళ్లాయి. జర్నలిస్టులపై 20కి పైగా దాడులు, మరో 20కి పైగా బెదిరింపులు నమోదయ్యాయి. సమోవా అనే చిన్న దేశంలో మహిళా జర్నలిస్టులపై లైంగికదాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్లో స్పిన్ బోల్దాక్ ప్రాంతాన్ని సందర్శించిన నలుగురు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులను జులై 26న ఆఫ్ఘన్ నేషనల్ డైరెక్టొరేట్ ఆఫ్ సెక్యూరిటీ సిబ్బంది అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలన్న ఆ దేశ జర్నలిస్టు సంఘాలు ఎఎన్జెయు, ఎఐజెఎల ఘోష నిరుపయోగమైంది. కాందహార్లో మరో ముగ్గురిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు వారి జాడలేదు. ఆ దేశంలో పత్రికలపై పూర్తిగా నియంతృత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కంబోడియా (కంపూచియా)లో అక్కడి ప్రభుత్వం ఆగస్టు 2న జర్నలిజంపై సరికొత్త నియమావళి సమీక్ష యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి, ఆంక్షలు మొదలుపెట్టింది. అక్కడి జర్నలిస్టు సంఘాలు కాంబోజెఎ, సిఎపిజెలు వెంటనే ఈ కమిటీని ప్రతిఘటించాయి. పాత్రికేయుల స్వేచ్ఛ పరిమితికి నిబంధనలను ఈ కమిటీ రూపొందించింది. అదే దేశంలో వాక్సిన్లపై ప్రజోపయోగ కథనం రాసినందుకు సీనియర్ జర్నలిస్టు కోవ్ పిసెత్పై కేసు పెట్టారు. అతనికి ఐదేళ్లపాటు శిక్షపడే అవకాశం వుంది. ఇక ఇండియాలో చెప్పాల్సిన పనిలేదు. ‘124ఎ రాజద్రోహం మొదలుకొని మీడియాపై వివిధ ఆంక్షలు విధించడం వరకు’ మోదీ సర్కారు తన జులుం ప్రదర్శిస్తూనే వుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో ఒక విలేకరి దారుణహత్యకు గురయ్యాడు. ఇది ఆందోళనకరమైన విషయం. ఇంఫాల్లోని ‘ది ఫ్రాంటియర్ మణిపూర్’ వెబ్సైట్పై వేధింపులు తీవ్రతరమయ్యాయి. ఇక పెగాసస్ స్పైవేర్తో ఇప్పటికే వందలాది మంది జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలను బిజెపి సర్కారు వేధిస్తున్న విషయం తెల్సిందే. ఈ విధంగా దాదాపు అన్ని దేశాల్లో పాత్రికేయులపై దాడులు పెరుగుతున్నాయి. హక్కుల పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులు ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది.