భారత్ మ్యాచ్పై సానియా స్పందన
దుబాయ్: యూఏఈ, ఒమన్లో టీ20 ప్రపంచకప్ 2021 మెగా సమరం ప్రారంభమైంది. క్వాలిఫైయర్ మ్యాచులు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రపంచకప్ కోసం అర్హత సాధించిన జట్లు సోమవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతున్నాయి. ఇక అసలు సమరం సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. అక్టోబర్ 24న ఫైనల్ కానీ ఫైనల్ పోరు జరుగనుంది. భారత్ తన ప్రయాణాన్ని దాయాది దేశం పాకిస్థాన్తో ఆరంభించనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి మాత్రం ఎప్పటిలానే తలనొప్పి తప్పేట్లు లేదు. ప్రతిసారి భారత్-పాక్ మ్యాచ్ జరిగినప్పుడు.. ఒకవైపు పుట్టినిల్లు, మరోవైపు మెట్టినింటి మధ్య ఆమె నలిగిపోతోంది. దాంతో ఈసారి సానియా ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్నపుడు ఇరు దేశాల నెటిజెన్ల ట్రోల్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాలో కనిపించకుండా పోవాలని నిర్ణయించుకున్నట్లు సానియా మీర్జా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఏడు సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో సానియా ఉన్నట్టుండి మాయమయిపోతుంది. ఆ వీడియోలో ఓ పోస్ట్ కూడా ఉంచింది.
‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రోజున చెడు వాతావరణం నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా’ అని వీడియోపై కాప్షన్గా రాసింది. అంతేకాదు అలిగినట్టుగా, నవ్వుతున్నట్టుగా ఉన్న రెండు ఎమోజీలను కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోపై కొందరు ఫాన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.