లాహోర్ : ‘భారత జట్టులో నాకెందుకో రెండు క్యాంపులు కనిపిస్తున్నాయి? ఒకటి కోహ్లికి అనుకూలం.. మరొకటి కోహ్లికి వ్యతిరేకం. నాతో పాటు చాలా మందికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని అనుకుంటున్నా. జట్టు రెండు గ్రూపులుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందో నాకు మాత్రం అర్థం కావడం లేదు. బహుశా… కోహ్లికి కెప్టెన్గా ఇదే ఆఖరి టీ20 ప్రపంచకప్ కాబట్టి.. ఇలా జరుగుతోందేమో! ఈ టోర్నీలో తను తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. ఇదైతే కాదనలేని వాస్తవం. అయితే, కోహ్లి గొప్ప క్రికెటర్. తనను కచ్చితంగా మనందరం గౌరవించి తీరాల్సిందే’’అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో స్పోర్ట్స్కీడాతో మాట్లాడిన రావల్పిండి ఎక్స్ప్రెస్ అక్తర్.. కోహ్లిసేన ఆట తీరును తప్పుబట్టాడు. న్యూజిలాండ్తో ఆడిన తీరు చూసిన తర్వాత వారిపై విమర్శలు రావడం సహజమేనన్నాడు. ‘‘టాస్ ఓడిన తర్వాత వాళ్ల ముఖాలు వాడిపోయాయి. అలాంటి ఆటిట్యూడ్ చాలా ప్రమాదకరం. టాస్ ఓడినంత మాత్రాన మ్యాచ్ ఓడినట్లేనని ఎట్లా అనుకుంటారు. గేమ్ ప్లాన్ లేకుండానే బరిలోకి దిగారా? భారత జట్టులో విభేదాలు ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్థాన్తో 10 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా నవంబరు 3న అఫ్గనిస్థాన్తో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.