అదరగొట్టిన బెంగళూరు
బెంగళూరు: వరుసగా రెండు ఓటములతో డీలా పడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు బాటపట్టింది. సొంత మైదానంలో దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు…నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దిల్లీ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. దిల్లీకి వరుసగా ఇది ఐదో ఓటమి. దిల్లీ బ్యాటర్లలో మనీశ్ పాండే (50, 38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) రాణించాడు. అక్షర్ పటేల్ (21), డేవిడ్ వార్నర్ (19), అమాన్ ఖాన్ (18) పరుగులు చేశారు. చివర్లో నోకియా (23, 14 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా ఆడినా అప్పటికే దిల్లీ ఓటమి ఖరారైంది. బెంగళూరు బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు విజయ్ కుమార్ వైశాఖ్ (3/20) ఆకట్టుకోగా…సిరాజ్ 2, పార్నెల్, హసరంగ, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (50, 34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకంతో రాణించాడు. డు ప్లెసిస్ (22, 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్), మహిపాల్ లామ్రోర్ (26, 18 బంతుల్లో 2 సిక్స్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (24, 14 బంతుల్లో 3 సిక్స్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. దిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా…నోకియా, లలిత్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.