క్రితిపూర్ (నేపాల్): యూఏఈ జట్టు క్రికెటర్ అసిఫ్ అలీ ఖాన్ సంచలన ప్రదర్శనతో దుమ్మురేపాడు. నేపాల్తో జరిగిన వన్డేలో 41 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఈ మ్యాచ్లో అసిఫ్ అలీ… 42 బంతుల్లో ఏకంగా 11 సిక్సర్లు, నాలుగు ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తద్వారా ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2019-2023లో భాగంగా నేపాల్ లోని క్రితిపూర్లో జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ వసీమ్ (63), అరవింద్ (94) లు రాణించారు. 175 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కు వచ్చిన అసిఫ్ అలీ… నేపాల్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 11 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. అసిఫ్ వీర విజృంభణతో చివరి ఓవర్లలో యూఏఈ భారీగా పరుగులు రాబట్టింది. ఐసీసీ సభ్య దేశాలతో పాటు అసోసియేట్ దేశాలలో కూడా ఈ సెంచరీ రికార్డు. ఈ జాబితాలో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్… 37 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేశాడు. ఆ తర్వాత జాబితాలో కివీస్ ఆటగాడు కోరె అండర్సన్ (36 బంతులు), పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో), మార్క్ బౌచర్ (44 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.