వారివల్లే చిరస్మరణీయ విజయం
ఓవర్సీస్ పిచ్లపై రాణిస్తున్న పేసర్లు
బౌలింగ్ హవాతో, బ్యాటింగ్ లోపాలు కనుమరుగు
ఓవల్: ఒకప్పుడు సుదీర్ఘ ఫార్మాట్లో భారత బౌలింగ్ బలం స్పిన్నర్లే! సొంతగడ్డపై స్పిన్ పిచ్లతో ప్రత్యర్థి పని పట్టేవారు. విదేశాల్లో పేస్కు అనుకూలించే పిచ్లపై తేలిపోయేవారు. ఓవర్సీస్లో డ్రా చేసుకుంటే గొప్పగా భావించేవారు. కానీ కొన్నాళ్లుగా ఈ విషయంలో భారీ మార్పు వచ్చింది. స్వదేశమైనా, విదేశమైనా భారత బౌలర్లు దుమ్ములేపుతున్నారు. ముఖ్యంగా పేసర్లు సత్తా చాటుతున్నారు. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై రెండుసార్లు ఓడిరచినా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ విజయాలందుకున్నా అది భారత పేసర్ల చలవే. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ మూడేళ్లుగా దుమ్మురేపగా.. వీరికి కొత్తగా మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ జత కలిశారు. తమదైన పేస్, స్వింగ్తో ప్రత్యర్థి పని పడుతున్నారు.
పేసర్ల పుణ్యమే..
బౌలింగ్లోనే కాదు.. బ్యాట్స్మెన్ చేతులెత్తేసిన వేళ లోయరార్డర్లో అనూహ్య ప్రదర్శనతో బ్యాట్ రaుళిపించి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో భారత్ పై చేయి సాధించిందన్నా.. ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ విజయాన్ని అందుకుందన్నా అది పేసర్ల పుణ్యమే. తాజా సిరీస్లో లార్డ్స్ టెస్ట్లో ఓటమి ముగింట నిలిచిన భారత్.. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే గెలుపొందింది. కీలక నాలుగో టెస్ట్లోనూ అద్భుత విజయాన్నందుకొని 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అప్పుడెప్పుడో 1971లో ఓవల్ మైదానంలో గెలిచిన భారత్ ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే విజయం సాధించింది.
బ్యాటింగ్కు అనువైన్ పిచ్లో..
నాలుగో ఇన్నింగ్స్లో ఇంగ్లిష్ జట్టు వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసిన స్థితిలో చివరి రోజు మన బౌలర్లు చేసిన అద్భుతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన అంటే అతిశయోక్తి కాదు. బ్యాటింగ్ చాలా తేలికైపోయినట్లు కనిపించిన వికెట్ మీద ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బౌలింగ్ చేసిన తీరు అసాధారణం. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో సైతం మన బౌలర్లు ఇలాంటి దృఢ సంకల్పాన్నే చూపించారు. తొలి టెస్టులో ఘోర పరాభవం తర్వాత భారత్ అంత గొప్పగా పుంజుకుని సిరీస్ సాధించిందంటే అందులో బౌలర్ల పాత్ర అత్యంత కీలకం. విదేశాల్లో పరిస్థితులు జట్టుకు అంత అనుకూలంగా లేనపుడు బౌలర్లు ఇలా గొప్ప ప్రదర్శనతో మ్యాచ్లు మలుపు తిప్పడం భారత క్రికెట్లో చూస్తున్న గొప్ప మార్పు.
బ్యాటింగ్ సమస్యలున్నా..
ఇప్పటికీ బ్యాటింగ్లో భారత్కు సమస్యలున్నాయి. ఎన్నో ఏళ్లుగా బ్యాటింగ్ మూల స్తంభాలుగా ఉంటున్న కోహ్లి, పుజారా, రహానే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. బ్యాటింగ్లో అప్పుడప్పుడూ పతనాలు చూస్తూనే ఉన్నాం. అయినా సరే.. భారత్ గెలుస్తోందంటే.. ఓవల్లో మాదిరి అద్భుతాలు ఆవిష్కరిస్తోందంటే అది బౌలర్ల చలవే. ముఖ్యంగా నాలుగో టెస్టు చివరి రోజు బౌలర్లు పనితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లార్డ్స్లో మాదిరే ఇది కూడా చరిత్రాత్మక ప్రదర్శన అనడంలో సందేహం లేదు.
బుమ్రా రికార్డు
ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 65వ ఓవర్ ఐదో బంతికి ఇంగ్లీష్ బ్యాట్స్మన్ ఓలి పోప్ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఖాతాలో 100వ వికెట్ చేరింది. బుమ్రా 24 మ్యాచుల్లో 100 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ రెండో స్థానంలో ఉన్నాడు. కపిల్ 25 టెస్ట్ మ్యాచుల్లో 100 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (28 టెస్టుల్లో 100 వికెట్లు), సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ (29 టెస్టుల్లో 100 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.