లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్య దర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యిన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్పైనే వీరు చర్చించినట్లు సమాచారం. అక్టోబర్-నవంబర్లో జరిగే ప్రపంచకప్ కోహ్లి కెప్టెన్సీకి చాలీ కీలకం కానుంది. కోహ్లి ఐసీసీ ఈవెంట్లలో జట్టును నాక్ అవుట్ స్థాయికి తీసుకెళ్లినా ట్రోఫీలను మాత్రం అందించ లేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పెద్దలు జట్టు సారథిని కలిశారని బోర్డు సభ్యుడొకరు మీడియాకు తెలిపాడు. ఐపీఎల్ అనంతరం భారత్ ఆడాల్సింది టీ20 ప్రపంచకప్ కనుక, దాని గురించే చర్చించి ఈ రహస్య భేటీలో చర్చించి ఉంటారని ఆ అధికారి పేర్కొన్నారు. వచ్చేనెలలో టీమిండియా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయనుండగా కోహ్లి`బోర్డు సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఐపీఎల్లోనూ భారత ఆటగాళ్లంతా పాల్గొంటుండగా, ప్రపంచకప్ నాటికి వారి పరిస్థితి ఏమిటి, జట్టు కూర్పు, ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు ప్రపంచకప్లో ఎంత వరకు ప్రాధ్యానం వంటి అంశాలను చర్చించిన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 2021 జరగనుండగా.. అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్ ఆతిథ్యంలోనే యూఏఈ వేదికగా ప్రపంచప్ జరగనుంది.