Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైద్యుల నిరంతరశ్రమ, 108వాహన సిబ్బంది,రక్తదాతలసహకారంతో గర్భిణీకి పునర్జన్మ

ఓ నెగిటివ్ దాతలకు, వైద్య సిబ్బందికి అభినందనలు
విశాలాంధ్ర, పార్వతీపురం/బెలగాం: వైద్యో నారాయణో హరిః అన్నది వాస్తవమని విశాలాంధ్ర పత్రిక ప్రతినిధులకు స్పష్టంగా గురువారం కనిపించింది.వివరాల్లోకి వెళితే కొమరాడ మండలంలోని దలాయిపేట గ్రామానికి చెందిన మంతిని దుర్గ అలియాస్ కె. త్రిలోచన 9నెలలు పూర్తి చేసుకున్న గర్భిణీ స్త్రీ. ఆమె గత ఏడునెలలనుండి రెగ్యులర్ గా వైద్య సలహా తీసుకొంటుంది. ఆమెరక్తం గ్రూప్ ఓ నెగిటివ్ కావడంతో పాటు ఆమెబిడ్డ సంచిలో సాంకేతిక సమస్యతో విశాఖ కె జి హెచ్ లో ప్రసవం చేసుకోవడం మంచిదని వైద్యులు పలుసార్లు చెప్పారు.ఆమె తల్లిదండ్రులు కూడా దానికి సిద్ధపడి బుదవారం రాత్రి ఒకవాహనాన్ని బుక్ చేసుకుని గురువారం ఉదయం ఐదు గంటలకు వెళ్ళడానికి అన్నిఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో గురువారం వేకువజామున 2.30గంటలకు అమెకు బ్లీడింగ్ కావడం కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు 108వాహనానికి ఫోన్ చేయగా వారు అరగంటలోపే గ్రామానికిచేరుకుని ఆమెకు ఆక్సిజన్ పెట్టి పార్వతీపురం జిల్లాఆసుపత్రికి నేరుగా తీసుకొని 4.30గంటలకు తీసుకుని వచ్చారు. అప్పటికే డ్యూటీ డాక్టరు శిరీష, వైద్య సిబ్బంది బలిజపేట మండలంనుండి విచ్చేసిన ఓ నెగిటివ్ గర్భిణీకి అత్యవసర ఆపరేషన్ చేస్తున్నారు. ఇంతలో రెండో గర్భిణీ దుర్గ అలియాస్ త్రిలోచన రావడంతోపాటు ఆమెకు ఓ నెగిటివ్ బ్లడ్ అనితెలిసి అవాక్కయ్యారు. అమ్మాయి పరిస్థితిచూసి ఛాలాచాలా సీరియస్ అని చెప్పారు. ఇంతలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, సీనియర్ డాక్టరు కామేశ్వరి తదితర డాక్టర్ల బృందం హుటా హుటిన అక్కడకి చేరుకున్నారు. అంతాపరీక్షించి బిడ్డ చనిపోవడం జరిగిందని,గర్భసంచి తొలగించాలని కోరగా తల్లిదండ్రులు అంగీకారం తెలిపారు. ఈదశలో  తల్లిని బ్రతికించడానికి  వారంతా శ్రమించినతీరు అభినందనీయం. ఆపరేషన్ తరువాత కూడా వైద్యులు, వైద్యసిబ్బంది నిరంతర పర్యవేక్షణలో ఉంచడం గమనార్హం. అమ్మాయి ఆపరేషన్ కోసం ఓ నెగిటివ్ బ్లడ్ గూర్చి వైద్యులు చెప్పగా అన్నిగ్రూపుల ద్వారా పార్వతీపురం జిల్లాలో సమాచారం తెలియజేయడంతో జనసేననాయకులు దాలినాయుడు, జగదీష్ లు స్పందించి పార్వతీపురం పట్టణానికిచెందిన సాయిఅనే జనసైనికుడును పంపించగామొదట అయన రక్తాన్ని ఎక్కించారు. తర్వాత మరో యూనిట్ రక్తాన్ని బోటు రామకృష్ణ పార్వతీపురం పట్టణానికి చెందిన కొట్ని. హర్షిత్ ను తీసుకొని వచ్చి రక్తాన్ని అందజేసారు. మొత్తం మూడుపాకెట్ల రక్టాన్ని వైద్యులు దుర్గకుఅందజేసారు. దీంతో దుర్గా నిండుప్రాణం నిలబడింది. ఇదిలాఉండగా జిల్లాఎస్పీ విధ్యాసాగర్ నాయుడుకు ఓ నెగిటివ్ బ్లడ్ గూర్చి సమచారం విశాలాంధ్ర ప్రతినిధి తెలియజేయగా అయనకూడా ప్రత్యేక శ్రద్ద తీసుకొని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమచారం చేరవేశారు. దీనికి
వీరఘట్టం ఎస్ ఐ వెంటనే స్పందించి తాను ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తినని వస్తానని చెప్పారు. అప్పటికే ఇద్దరుయువకులు, వైద్యులు రక్తాన్ని ఇవ్వడంతో అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లా ఎస్పీతోపాటు ఎస్బి సిఐ శ్రీనివాసరావులు స్పందించినతీరు అభినందనీయం. గర్భిణీ స్త్రీలు, వారితల్లిదండ్రులు డెలివరీపై అశ్రద్ద చేయవద్దని, తప్పనిసరిగా డెలివరీలు ప్రభుత్వఆసుపత్రిలో చేసుకోవాలనీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి తెలిపారు. జిల్లా కలెక్టరు,ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లపుడూ కృషి చేస్తున్నట్లు ఆమెతెలిపారు. అదేసమయంలో యువత స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానంచేసి ఆసుపత్రిలో రక్తకొరతను నివారించాలని కోరారు.పార్వతీపురంలోని విశాలాంధ్ర పాత్రికేయులు వైద్యులను, వైద్య సిబ్బందిని, రక్తదాతలని, జిల్లా ఎస్పీ తదితరులను అభినందించారు 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img