వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అకాల వర్షాలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన ఏర్పాట్లపై నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాగునీటి కాల్వలు నిండుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో బలహీన కాల్వలు గుర్తించి మరమ్మతులు చేసేలా నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించి ఆదేశించాలని పేర్కొన్నారు. గ్రామాలలో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను గుర్తించి అలాంటి కుటుంబాలను అప్రమత్తం చేయాలన్నారు. నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు నూతనంగా మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. గద్వాలలో నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు మంజూరైన మెడికల్ కాలేజీలకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గద్వాల నర్సింగ్ కాలేజీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.