. ఇంటర్ మార్కులతో వైద్య సీట్లు కేటాయించాలి
. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్
. నిరసన ప్రదర్శన… ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ దిష్టిబొమ్మ దహనం
విశాలాంధ్ర`హైదరాబాద్: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి అధ్వర్యంలో హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి వై జంక్షన్ కూడలి వరకు యువజన సంఘం నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.40 లక్షల మంది నీట్ పరీక్షను రాసి, ఉతీర్ణత పొందిన విద్యార్థుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యంతో విద్యా భవిష్యత్ను కోల్పోయే విద్యార్థులకు బాసటగా నిలబడి కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలన్నారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 4న నీట్ 2024 ఫలితాలను ప్రకటించిందని, అయితే ఈ ఫలితాలలో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు పొందారని, ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారనే దానిపై వివాదం నెలకొందని తెలిపారు. హర్యానాలోని పరీక్షా కేంద్రంలో ఒకే గదిలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం ఈ పరీక్షలో ప్రశ్నాపత్నం లీక్ అయ్యిందా..? లేక మాస్ కాపీయింగ్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయన్నారు. కొంతమంది విద్యార్థులకు గ్రేస్ ఇచ్చామని చెబుతున్న ఎన్టీఏ ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇచ్చారో చెప్పకపోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ వివాదంపై తాజాగా ఎన్టీఏ వివరణ ఇచ్చిందని, కొన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగిందని వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు డైరెక్టర్ చెప్పడం సిగ్గు చేటు అన్నారు. కేవలం కోర్టుకు వెళ్లిన విద్యార్థులకే గ్రేస్ మార్కులు ఇచ్చారని, మిగిలిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించకపోవడం పట్ల విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా సెంటర్లలో పేపర్ ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు సమయం కోల్పోయారని అనేక మంది నిపుణులు పేర్కొంటున్నారన్నారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, రాష్ట్ర సమితి సభ్యులు మాజీద్, కళ్యాణ్, అనీల్, షబీనా, పూజా, కిరణ్మయి, నేహా, ప్రమోద్, కిరణ్, తన్మయి, మురహరి తదితరులు పాల్గొన్నారు.