. ప్రముఖ రాజకీయ నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే
. వందేమాతరం ఫౌండేషన్ మా బాధ్యత పెంచింది
. సీఎం రేవంత్ రెడ్డి
విశాలాంధ్ర`హైదరాబాద్: ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని అన్నారు. అలాంటి విద్యార్థినీవిద్యార్థులకు ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వందేమాతరం ఫౌండేషన్ ఇటువంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందన్నారు. 90 శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని తెలిపారు. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, అక్కడ మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిరదన్నారు. కానీ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయరాదని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభించామని, విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని వివరించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడిరచారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థల వల్ల తల్లిదండ్రులతో పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక అధ్యయన నివేదిక వచ్చిందని తెలిపారు. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని, విద్య మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని, పెట్టుబడి అని అన్నారు. విద్యపై పెట్టే పెట్టుబడి మన సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, ఎవరైనా సలహాలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్లో రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మీకు ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకు వెళతామని తెలిపారు.