జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంపిణీ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పథకాలతో ప్రజలకు ప్రతి రోజు పండుగేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే పండుగలను నిర్వహిస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రజలకు బట్టలు అందజేయడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు సీఎం కేసీఆర్ బట్టలు పెట్టే ఆనవాయితీని కొనసాగిస్తున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.46.96కోట్ల విలువైన 13.45లక్షలకుపైగా చీరెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.