విశాలాంధ్ర-హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు షాక్ తగిలింది. అపార్టీకి చెందిన పెద్దపల్లి (ఎస్సీ) లోక్సభ సభ్యుడు డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఎంపీ వెంకటేశ్కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు, వ్యాపారవేత్త మన్నె జీవన్రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత రహ్మాన్, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరికల అనంతరం కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ వెంకటేష్ నేత, మన్నె జీవన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా
కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేశ్ నేత, మన్నె జీవన్ రెడ్డిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఖడ్గేకి పరిచయం చేశారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఖడ్గే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్నగర్), జనంపల్లి అనిరుధ్ రెడ్డి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రానికి దిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని కలిసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, అమలు చేయనున్న గ్యారంటీలు, బీసీ కుల గణన తదితర అంశాలను ఆమెకు వివరించారు. మంగళవారం పార్టీలో చేరికల అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు.