Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఉస్మానియాలో సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఉస్మానియాలో సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని, దీన్ని రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని తెలిపారు. రూ. 7 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌, రూ.2 కోట్ల 12 లక్షలతో సీటీ స్కాన్‌ను ప్రారంభించాం అని చెప్పారు. ఉస్మానియాలో రెండు సీటీ స్కాన్స్‌ ఉన్నప్పటికీ ఒకటి పని చేయడం లేదు. ఒకటి మాత్రమే పని చేస్తోంది. మూడో సీటీ స్కాన్‌ను ఇవాళ రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఫెయిల్‌ అయిన సీటీ స్కాన్‌ను త్వరలోనే ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. దీంతో రోగులకు వైద్య సేవలు త్వరితగతిన అందనున్నాయి. ఉస్మానియాలో ఉన్న 180 వెంటిలేటర్లలో 102 వెంటిలేటర్లు మాత్రమే పని చేస్తున్నాయి. మిగతా వాటికి మరమ్మతు చేయాలని ఆదేశించాం. ఉస్మానియాలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో కొత్త మార్చురీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకు రూ. 5 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్చురీలను ఆధునికరిస్తున్నాం అని స్పష్టం చేశారు. జనవరి1న మళ్ళీ ఉస్మానియాలో పర్యటిస్తాను అని హరీశ్‌రావు చెప్పారు. ఉస్మానియాలో ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు పెంచాలి. ఉస్మానియాకు ఎన్‌ఏబీసీ అక్రిడిటేషన్‌ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఉస్మానియా నూతన బిల్డింగ్‌పై కోర్టు కేసు తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img