కరోనా థర్డ్ వేవ్ ఉథృతి నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 వరకు విద్యాశాఖ సెలవులు ఇవ్వగా..కొన్ని రోజుల నుంచి పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తి తగ్గుముఖంపడుతోన్న నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ ఇవాళ(జనవరి 29) అధికారిక ప్రకటన చేయనుంది. సెలవులు 30 వరకే ఉన్నా ఒకరోజు ఆలస్యంగా స్కూల్స్ రీ-ఓపెన్ అవ్వనున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని ఈ నెల 31 నుంచి తెరుస్తారా? అని ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల ప్రభుత్వం నేడు తన నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.