దేశానికే రోల్ మోడల్గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని..కేంద్రం వివిధ సంస్థల నుంచి వస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే ఉత్తమ గ్రామాల జాబితాలో మొదటి 10 తెలంగాణ గ్రామాలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు అని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు,ఛీత్కారాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తొలుత ప్లీనరీ వేదికపై తెరాస జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు.. ఇవేం సాధించలేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రతిపాదిక పడాలని స్పష్టంచేశారు.
చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఇవాళ దుఖ పడుతున్నాం. నివారణ జరగాలి. కేసీఆర్ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా? అని అంటున్నారు. దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జరగాలి. భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటది. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండాకు శ్రీకారం చుడుదాం. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం అని సీఎం అన్నారు.