తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి విమర్శలు
తమ పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో టీపీసీసీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తూ, బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేవంత్రెడ్డి పోస్టు చేశారు. ’’దీన్ని ఇంకెన్ని సార్లు రిపీట్ చేస్తారు కేసీఆర్? అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఫిర్యాదులు చేస్తే ఆయనపై కేసులు నమోదు చేయకుండా కాంగ్రెస్ శ్రేణులను ఎందుకు అరెస్టు చేస్తున్నారు? అధికారం పోతుందని మీరు భయపడుతున్నట్లు మాకు స్పష్టంగా అర్థమవుతోంది’’ అని విమర్శించారు.