రాజకీయ తటస్థత మోసానికి నాంది
ప్రతిపక్షం లేకుంటే… ప్రజలే విపక్షం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: అబద్దాలు చెప్పడంలో మోదీ గోబెల్స్ను మించిపోయాడని, భారతదేశ చర్రితలో ఏ ప్రధాని చెప్పనన్ని అబద్దాలు చెప్పి ఆయన రికార్డును సొంతం చేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా శనివారం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. అతి తక్కువ మెజార్టీతో గెలిచిన ప్రధాన మంత్రిగా కూడా ఆయన అపకీర్తిని మూటకట్టుకున్నారన్నారు. మోదీ గ్యారెంటీ కాదని, ఆయన మాటల్లో వాస్తవికత లేకపోవడం వల్లే బీజేపీ 305 స్థానాల నుంచి 240 స్థానాలకు పడిపోయి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఆధారపడి పాలన సాగించాల్సి వచ్చిందన్నారు. రూ.16 లక్షల కోట్లు ఎగవేతకు మోదీ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ఎగవేతదారుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా గుజరాతీయులేనని అన్నారు. గతంలో రూ.2.50 లక్షల కోట్లు ఎగవేతకు గురైతే మోదీ పదేళ్ల కాలంలో రూ.16 లక్షల కోట్లకు ఎగవేత సొమ్ము చేరిందని నారాయణ ఆరోపించారు. సెక్యూలరిజాన్ని, మతాన్ని వదలకుండా విమర్శించిన మోదీకి ఆశించిన ఫలితం దక్కలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక బలమైన ప్రతిపక్షం కలిగిన ప్రభుత్వం ఏర్పడిరదని ఆయన తెలిపారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారని, ఇప్పుడు వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీ సవరించిన కార్మిక చట్టాలను అమలు చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయని ఇది సరైంది కాదని తటస్థ వైఖరి ఎవరినో ఒకరిని మోసం చేయడానికేనని తెలిపారు. స్పష్టమైన వైఖరిని అవలంభించిన రాజకీయ పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని దోబుచులాడిన వారిని ఓడిరచారన్నారు. బీజేపీకి మద్దతు అంటూనే స్వతంత్రతను ప్రకటించిన వైసీపీని ఓడిరచారని, గెలిచిన చంద్రబాబుది బీజేపీ విషయంలో సరైన వైఖరి కాదన్నారు. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొందని బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే కమ్యూనిస్టులను ఓడిరచాలని కాంగ్రెస్ చూడటం సరైంది కాదన్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై నారాయణ స్పందిస్తూ … ప్రజాప్రతినిధులను చేర్చుకున్నంత మాత్రాన విపక్షం లేకుండాపోదని ప్రజలే విపక్షమవుతారన్న వాస్తవాన్ని చరిత్ర చెబుతుందన్నారు. కేసీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వారు విపక్ష సభ్యులను చేర్చుకుంటే ప్రతిపక్షం ఉండదని భావించారని కాని ప్రజలే విపక్షమై పనిచేసి విపక్షాలను గెలిపించారని ఆయన గుర్తు చేశారు. ఏ పార్టీ నుంచి గెలిచారో వారు పార్టీ మారే ముందు పదవికి రాజీనామా చేయాలని, ఆ తర్వాతే రాజకీయ మార్పు జరగాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పనులే కాంగ్రెస్ చేస్తుందని, ఇది బీజేపీకి పరోక్షంగా ఊతమిచ్చినట్లేనని నారాయణ చెప్పారు. బీజేపీ నాలుగు నుంచి ఎనిమిది సీట్లు గెలవడంపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని, బీజేపీ బలపడడానికి అవకాశం ఇవ్వరాదని అన్నారు. రాష్ట్ర సమితి సమావేశాల్లో పార్టీ కార్యక్రమాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎసకే సాబీర్పాషా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కే జానిమియా పాల్గొన్నారు.