అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికీ వెళ్లి కొవిడ్-19 బూస్టర్ డోస్ ఇవ్వాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బూస్టర్ డోసును ఇప్పటికే ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి ఫ్రీగా బూస్టర్ డోసు పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రచించింది.ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు బాధ్యతగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సోమవారం (జూలై 25) మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన మంత్రి హరీశ్ రావు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లాలి. పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని హరీశ్ రావు ఆదేశించారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు వారికి సహకరించాలని కోరారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం పరిశుభ్రతపై కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హరీశ్ రావు తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఆహారం కల్తీ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.