సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్కు తొలి దెబ్బ
నవీన్ గెలుపు… బాధ్యతను పెంచింది: కేటీఆర్
విశాలాంధ్ర-హైదరాబాద్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు తొలి దెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్రెడ్డి 111 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం గమనార్హం. అయితే ఈ జిల్లాలో బీఆర్ఎస్ గెలుపు మాత్రం ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచిందని, ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ బీఆర్ఎస్ అద్భుత గెలుపు హర్షణీయమన్నారు. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపుగా అభివర్ణించారు. అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇదని, ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిదని చెప్పారు. నాడైనా… నేడైనా… ఏనాడైనా… తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని, ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిదని పేర్కొన్నారు.
111 ఓట్ల మెజార్టీతో విజయం
మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్కు 763, కాంగ్రెస్ అభ్యర్థికి 652 ఓట్లు వచ్చాయి. 111 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం, కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున నవీన్కుమార్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో ఉప ఎన్నిక కౌంటింగ్ను ఇప్పటివరకు పెండిరగులో ఉంచారు.