తెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు శనివారం లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగంపై మోదీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉన్నదని తన లేఖలో కేటీఆర్ విమర్శించారు. చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయమని తప్పుబట్టారు. మోదీ సర్కార్ నేతన్నల కడుపుకొడుతోందని మండిపడ్డారు. చేనేత, జౌళి రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రకటనలు కాదు.. పథకాలు రావాలి.. మాటలు కాదు-నిధుల మూటలు ఇవ్వండని కేటీఆర్ కోరారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు కేంద్ర సాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, టెక్స్టైల్పై జీఎస్టీ తగ్గించాలన్నారు. చేనేత, జౌళి రంగాల సమస్యలపై పార్లమెంట్లో నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు.