అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి
న్యూ ఇయర్ మరికొద్ది రోజుల్లోనే వస్తున్న వేళ హైదరాబాద్ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. హోటళ్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్స్ సంస్థలు నిర్వహించే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు నిబంధనలు ప్రవేశపెట్టారు. ఈ నిబంధనల ప్రకారం న్యూ ఇయర్ వేడుకలకు పది రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తీసుకునేందుకు డిసెంబర్ 21ను లాస్ట్ డేట్గా పోలీసులు నిర్ణయించారు. ఆ లోపు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకుంటేనే వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుంది. డిసెంబర్ 31న అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి ఇచ్చారు. హోటళ్లు, పబ్లు, క్లబ్స్, ఇతర సంస్థలు నిర్వహించే న్యూ ఇయర్ వేడుకల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ఈవెంట్ స్థలం మొత్తం కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాలు ఖచ్చితంగా అమర్చాలని ఆదేశించారు. ప్రాంగణం వరకు మాత్రమే వినపడేలా సౌండ్ సిస్టమ్ ఉండాలని, సౌండ్ తీవ్రత 45 డెసిబెల్స్కు మించి ఉండకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు.సెలబ్రేషన్ ముగిసిన తర్వాత మద్యం సేవించినవారు డ్రైవింగ్ చేయకుండా ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదేనని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం తాగినవారు జాగ్రత్తగా ఇంటికి చేరుకునేందుకు యాజమాన్యాలే క్యాబ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాలన్నారు. పార్కింగ్ సదుపాయం కల్పించాలని, సామర్థ్యంకు మించి ఈవెంట్స్ పాసులు ఇవ్వకూడదని పోలీసులు తెలిపారు.